బాలీవుడ్ ఎన్నో ఆశలు పెట్టుకున్న స్టార్ హీరోల భారీ బడ్జెట్ చిత్రాలు కూడా బాక్సాఫీసు వద్ద చతికిలబడిన సమయంలో మరో దక్షిణాది మూవీ అక్కడ మ్యాజిక్ చేస్తోంది. విచిత్రమేమిటంటే అది.. రాజమౌళి, శంకర్, ప్రశాంత్నీల్ వంటి ప్రముఖ దర్శకులు తెరకెక్కించిన చిత్రమో.. లేక దక్షిణాది ప్రముఖ హీరోలు నటించిన భారీ బడ్జెట్ మూవీనో కూడా కాదు. నిఖిల్ కథానాయకుడిగా చందూ మొండేటి పరిమిత బడ్జెట్తో తెరకెక్కించిన ‘కార్తికేయ-2’ ఇప్పుడు మరో ‘పుష్ప’ చిత్రంలా బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఈ మూవీ ఇప్పటికే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని హిట్ టాక్తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
అమీర్ హీరోగా వచ్చిన ‘లాల్ సింగ్ చడ్డా’, అక్షయ్కుమార్ నటించిన ‘రక్షాబంధన్’ వంటి భారీ చిత్రాల మధ్య అసలు ఏమాత్రం ఆదరణ దక్కుతుందో చూద్దామనుకుంటూ మేకర్స్ ఈ చిత్రాన్నిఉత్తరాదిన కేవలం 50 థియేటర్లలో విడుదల చేశారు. అయితే అక్కడి ప్రేక్షకుల నుంచి ఊహించని స్థాయి ఆదరణ లభించడంతో థియేటర్ల సంఖ్యను ముందు 200కు, ఆ తర్వాత 700కు పెంచారు. అమీర్, అక్షయ్ల చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం కావడం ‘కార్తికేయ’ మూవీకి కలిసొచ్చిందని చెప్పాలి. కృష్ణ తత్వం చుట్టూ తిరిగే కథ కావడం, ఉత్తరాదిన కృష్ణుడి ఆరాధన ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడి ప్రేక్షకులు ఈ చిత్రానిక కనెక్టయ్యారని సినీ విశ్లేషకులు అంటున్నారు. పరిస్థితి చూస్తుంటే ఈ చిత్రం అక్కడ భారీ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తానికి దక్షిణాది చిత్రాల సక్సెస్ ట్రెండ్ను నిఖిల్ మూవీ కూడా కొనసాగించిందని చెప్పుకోవాల్సిందే.