విశ్వ నటుడు కమల్ హాసన్ తాజా సినిమా ‘విక్రమ్’ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. చాలాకాలం తరువాత బాక్సాఫీసు వద్ద కమల్ సత్తా ఏంటో చాటిన చిత్రం ఇది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్లో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కూడా కీలక పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. ఇక చివరిలో రోలెక్స్గా కనిపించిన సూర్య కూడా ప్రేక్షకులను అలరించారు. కాగా తమిళనాట అత్యధిక వసూళ్ల రికార్డును ఇప్పటికే తన ఖాతాలో వేసుకున్న ఈ చిత్రం మరో ఘనతను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లు వసూలు చేసిన చిత్రాల జాబితాలో చోటు దక్కించుకుంది.
భారత్లో ఇప్పటిదాకా రూ. 284 కోట్లు వసూలు చేసిన విక్రమ్ మూవీ ఓవర్సీస్లో రూ. 120 కోట్ల వసూళ్లను సాధించింది. విడుదలై నాలుగువారాలు కావస్తున్నా ఇంకా బాక్సాఫీసు వద్ద సందడి చేస్తున్న ఈ మూవీ రన్ ఎక్కడిదాకా సాగుతుందో చూడాల్సిఉంది. కాగా ఈ చిత్రం విజయం అందించిన జోష్తో కమల్ హీరోగా తెరకెక్కుతూ మధ్యలో ఆగిపోయిన భారతీయుడు -2 చిత్రీకరణ తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోపక్క కొత్తగా మరికొన్ని భారీ ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రయత్నాలు చురుగ్గా సాగుతున్నాయి.