దర్శకధీరుడు రాజమౌళి చిత్రాల్లో గ్రాఫిక్స్ కు ఎంత ప్రాధాన్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పెర్ఫెక్షన్ కు ప్రాణం పెట్టే జక్కన్న బాహుబలి చిత్రంలో సీజీ వర్క్స్ను హాలీవుడ్కు ఏమాత్రం తగ్గని స్థాయిలో సమర్థంగా ఉపయోగించుకుని ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేసిన విషయం తెలిసిందే. తాను అనుకున్నఎఫెక్ట్ వచ్చేదాకా తాను శ్రమించడమే కాకుండా చిత్రంలో నటీనటులను కూడా ఓ రేంజ్లో పిండేసి మరీ నటనను రాబట్టుకునే డైరెక్టర్ గా ఆయనకు పేరుంది. ఆయన దర్శకత్వంలో మూవీ అంటే కనీసం రెండేళ్లపాటు కాల్షీట్లు ఇవ్వాల్సిందే. అయినా సరే రాజమౌళి చిత్రంలో నటించే అవకాశం కోసం దేశంలోని ప్రముఖ హీరోలు సైతం ఆతృతగా ఎదురుచూసే స్థాయి జక్కన్నది. ఇటీవలే ఆర్ఆర్ఆర్ చిత్రంతో బాక్సాఫీసును షేక్ చేసే విజయం అందుకున్న రాజమౌళి తన తరువాత ప్రాజెక్టును సూపర్ స్టార్ మహేష్తో తెరకెక్కించేందుకు సన్నాహాల్లో ఉన్నారు. పట్టాలెక్కకుండానే ఈ చిత్రంపై ఆకాశాన్నంటే అంచనాలు నెలకొనడం విశేషం.
ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ అద్భుతమైన కథను సిద్ధం చేసినట్టు ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇక ఈ చిత్రం కూడా ఇండియన్ సినిమాను మరో స్థాయికి చేర్చేలా, హాలీవుడ్ సినిమాలతో పోటీ పడేలా రూపొందించేందుకు రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలుపెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. గత నెలలో సమ్మర్ వెకేషన్కు కుటుంబంతో ఫారిన్ వెళ్లిన మహేష్తో అక్కడ రాజమౌళి కలిసి దీనికి సంబంధించిన చర్చలు జరిపినట్టు మీడియాలో ప్రచారం జరిగింది. కాగా రాజమౌళి, తాజాగా ఫ్రాన్స్ లోని ప్రముఖ 3డి యానిమేషన్ స్టూడియో యూనిట్ ఇమేజ్ ని ప్రముఖ నిర్మాత శోభు యార్లగడ్డ, గ్రాఫిక్ డిజైనర్ కమల్ కన్నన్ లతో కలిసి వెళ్లి సందర్శించడం ఆసక్తికరంగా మారింది. ఆయన ఆ సంస్థ నిర్వాహకులతో చర్చించి, కొన్ని విషయాలపై సందేహాలు అడిగి తెలుసుకున్నారు.
యూనిట్ ఇమేజ్ సంస్థ సభ్యులను కలిశానని, రానున్నరోజుల్లో వారితో కలిసి పని చేసే అవకాశం లేకపోలేదని రాజమౌళి తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా వారితో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ పోస్ట్ పెట్టారు. దీంతో రాజమౌళి, మహేష్ కాంబోలో తెరకెక్కనున్న మూవీ కోసమే వారిని కలిసారని, ఇది ఆయన గత చిత్రాలన్నింటికంటే భారీ స్థాయిలో తెరకెక్కనుందని, ఈ చిత్రంలో సీజీ వర్క్స్కు ఉన్న ప్రాధాన్యంతోనే ఆయన పలు సంస్థలను సంప్రదిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇటీవలి ఆర్ఆర్ఆర్ చిత్రంలో కూడా గ్రాఫిక్స్ ఉన్నా కోవిడ్ పాండమిక్ పరిస్థితుల వత్తిడుల కారణంగా వాటి నాణ్యతపై పెద్దగా దృష్టి పెట్టలేకపోయిన జక్కన్న ఈసారి మరో వెండితెర వండర్ సృష్టించి ఏకంగా హాలీవుడ్కే సవాల్ విసరడం ఖాయమని పరిశ్రమ వర్గాలంటున్నాయి.