ఇటీవలి కాలంలో తెలుగు సినీ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూసిన సినిమాల్లో కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు చెర్రీ కలిసి నటించిన ‘ఆచార్య’ చిత్రం కూడా ఒకటి. ఏప్రిల్ 29న భారీ స్థాయిలో విడుదలైన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. నిజానికి ఇప్పటిదాకా కొరటాల శివ తెరకెక్కించిన చిత్రాలన్నీ సంచలన విజయాలనే సొంతం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ దర్శకుడి టేకింగ్పై నమ్మకం, దానికి తోడు ఇప్పటికీ తగ్గని చిరంజీవి క్రేజ్, అటు పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన రాంచరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటించడం.. ఇవన్నీ ‘ఆచార్య’ చిత్రంపై మెగా అభిమానులకే కాదు.. సామాన్య ప్రేక్షకుల్లోనూ విపరీతమైన అంచనాలు పెంచేశాయి.
అయితే ఈ చిత్రం ఆ అంచనాలను అందుకోవడంలో విఫలమైందనే చెప్పాలి. వెండితెరకు రీ ఎంట్రీ ఇచ్చాక మెగాస్టార్ నటించిన మూడో సినిమా ఇది. భారీ వ్యయంతో తెరకెక్కిన ‘సైరా నరసింహారెడ్డి’ కూడా ఊహించిన స్థాయిలో విజయం అందుకోకపోవడంతో ఎలాగైనా భారీ సక్సెస్ సొంతం చేసుకోవాలని చిరంజీవి కసిగా చేసిన చిత్రమిది. విడుదలకు ముందుకూడా దీనితో మళ్లీ తన హవా మొదలవుతుందన్న గట్టి విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ చిత్రం ఫలితం ఆయన భవిష్యత్ ప్రాజెక్టులపై పడుతుందన్నది నిజం. ఇంతకీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందనుకున్న ఈ మూవీ ప్రేక్షకులను ఎందుకు నిరాశపరచింది..? దీనికి పలు రకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
దర్శకుడు కొరటాల శివ ఇప్పటిదాకా పని చేసింది ప్రభాస్, మహేశ్, తారక్ వంటి యువ హీరోల తోనే. చిరంజీవి లాంటి సీనియర్ హీరోకు తగిన కథను ఎంచుకోవడంలో అతడు విఫలమయ్యాడని, కన్ఫ్యూజన్తో మరీ ఎప్పుడో 1980ల్లోనూ 90ల్లోనూ పలుసార్లు ప్రేక్షకులు చూసేసిన ఇతివృత్తాన్నితీసుకున్నాడని పలువురు అంటున్నారు. అయితే అదే కథను మరింత మెరుగైన సన్నివేశాలతో ఆకట్టుకునేలా తీర్చిదిద్దవచ్చని, కథనం ప్రేక్షకులకు ఆసక్తి కలిగించేలా రూపొందించి ఉంటే చిరంజీవి, చెర్రీల ఇమేజ్ ఈ చిత్రాన్ని హిట్ చిత్రాల జాబితాలో చేర్చగలిగి ఉండేదని, ఇక్కడ దర్శకుడిదే లోపం కనిపిస్తోందని, మెగా అభిమానులు అంతర్గత చర్చల్లో అభిప్రాయపడుతున్నారు.
అయితే చిరంజీవి లాంటి నాలుగు దశాబ్దాలకు పైగా అనుభవమున్న హీరో కథ ఎంపికలోనూ, చర్చల్లోనూ పాలు పంచుకోకుండా ఉండరని, ఆయన ఓకే చేశాకనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కిందని మరికొందరు అంటున్నారు. సంగీత దర్శకుడిగా మణిశర్మను ఎంపిక చేసింది మెగాస్టారేనని, ఒకటి రెండు పాటలు తప్ప బీజీఎం సహా సంగీతం ఆకట్టుకోలేక పోయిందన్న వ్యాఖ్యలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. దీంతో ఇది సమిష్టి వైఫల్యంగానే చూడాలని చెపుతున్నారు. కరోనా కారణంగా షూటింగ్ షెడ్యూల్స్ దెబ్బ తినడం కూడా ప్రభావం చూపిందన్న వాదన కూడా ఉంది.
నిజానికి రాంచరణ్ ఇమేజ్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో మరో స్థాయికి వెళ్లిపోయింది. రాజమౌళి చూపించిన స్థాయిలో హీరోలను ఇతర దర్శకులు చూపించలేకపోవడంతోనే ఆయన డైరెక్షన్లో చేసిన హీరోల తరువాత సినిమాలు ఫెయిలయ్యాయన్న టాక్ ఇండస్ట్రీలో ఇప్పటికే బలంగా ఉంది. దానిని ఈ సినిమా బ్రేక్ చేస్తుందని అందరూ చాలా నమ్మకం పెట్టుకున్నారు. అయితే ‘ఆచార్య’ కూడా ఆ ఆనవాయితీని కొనసాగించిందనే చెప్పాలి. ఇక ఇప్పుడు చిరంజీవి తన తరువాత ప్రాజెక్టుల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదని ఈ చిత్రం ఫలితం తేల్చిచెప్పిందనుకోవాలి.