సీనియర్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించిన మూవీ లైగర్. ఈ సినిమాపై విడుదలకు ముందే అద్భుతమైన క్రేజ్ నెలకొన్న విషయం తెలిసిందే. ఆగస్టు 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కొద్ది రోజులుగా ఈ సినిమా ప్రమోషన్ ఈవెంట్లు గ్రాండ్గా నిర్వహిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్, కరణ్ జోహార్ నిర్మించిన ఈ మూవీలో అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్, టీజర్, సాంగ్స్ విడుదలై మూవీపై భారీ అంచనాలు పెంచేశాయి.
లైగర్కు స్పెష్ ఎమోజీ క్రియేట్ చేసిన ట్విటర్
ఇక సోషల్ మీడియాలో అతిపెద్ద ఫాలోయింగ్ కలిగిన హీరోల్లో ఒకడిగా ఉన్న విజయ్ దేవరకొండ మూవీ ప్రమోషన్లకు ఆ అంశం కూడా బాగానే కలిసివస్తోందని చెప్పాలి. ఇన్స్టాగ్రామ్లో విజయ్ కు ఏకంగా 17 మిలియన్ల ఫాలోవర్లు ఉండటం విశేషం. తెలుగు హీరోల్లో అతడికంటే ఎక్కువ ఫాలోయర్లను కలిగిఉన్నది అల్లు అర్జున్ మాత్రమే. గురువారం లైగర్ మూవీకి సంబంధించి ట్విట్టర్ లో స్పెషల్ గా ఎమోజిస్ విడుదల చేసారు. విజయ్ అభిమానులతో పాటు, సినీ అభిమానుల్లో మరింత జోష్ నింపేలా #Liger #LigerHuntBegins #WaatLagaDenge హ్యాష్ ట్యాగ్స్ ప్రస్తుతం లైగర్ ఎమోజిస్ తో ట్విట్టర్ లో దూసుకెళ్తున్నాయి. త్వరలో మూవీ టికెట్ ఆన్లైన్ బుకింగ్స్ ని ఓపెన్ చేయనున్నారు. ఇప్పటికే యూఎస్లో ఈ చిత్రానికి సంబంధించిన ప్రీమియర్ షోస్ అడ్వాన్స్ బుకింగ్ ని ఓపెన్ చేయగా వాటికి మంచి స్పందన లభించినట్టు తెలుస్తోంది.
ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో మళ్లీ సక్సెస్ బాట పట్టిన దర్శకుడు పూరీ జగన్నాథ్ కసిగా తెరకెక్కించిన చిత్రమిది. దీని తరువాత మరిన్ని భారీ ప్రాజెక్టులకూ ఆయన సిద్ధమవుతున్నారు. గతంలో సూపర్ స్టార్ మహేష్ కోసం సిద్ధం చేసిన స్క్రిప్టుతో జనగణమన చిత్రాన్ని తాజాగా విజయ్ దేవరకొండ కథానాయకుడిగా రూపొందించనున్నట్టు ఇప్పటికీ పూరీ ప్రకటించిన విషయం తెలిసిందే.