ఒకప్పుడు భారతీయ సినీ పరిశ్రమలో ఉత్తరాది.. దక్షిణాది సినిమాల మధ్య స్పష్టమైన వ్యత్యాసం కనిపించేది. సంస్కృతి పరంగాను ప్రేక్షకుల అభిరుచి ప్రకారం కూడా తేడా ఉండటంతో వేరే భాషల చిత్రాలు బాలీవుడ్లో పునర్నిర్మించినా, లేక అక్కడ విజయవంతమైన చిత్రాలు దక్షిణాది భాషల్లో రీమేక్ చేసినా నేటివిటీకి తగ్గట్టు మార్పులు, చేర్పులు చేయడం తప్పనిసరయ్యేది. దక్షిణాదిన కూడా టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్వుడ్ పరిశ్రమల్లో ఎవరి దారి వారిదే. ఆయా భాషల్లో సూపర్ స్టార్లైనా వారి వెలుగు అక్కడి ప్రేక్షకులకే పరిమితం. వారి హిట్ చిత్రాలు డబ్బింగ్ చేసి ఇతర భాషల్లోకి వదిలితే అవి ఓ మోస్తరు వసూళ్లు మాత్రమే సాధించగలిగేవి. రజనీకాంత్, కమల్హాసన్ వంటి హీరోలు, కె. బాలచందర్, మణిరత్నం, శంకర్ వంటి కోలీవుడ్ డైరెక్టర్ల చిత్రాలు మాత్రం ఇందుకు మినహాయింపు. వీరి చిత్రాలకు మాత్రమే ఇతర భాషల్లోనూ చెప్పుకోదగిన మార్కెట్ ఉండేది.
అయితే నవతరం హీరోలు, డైరెక్టర్ల హవా మొదలయ్యాక భాషాపరమైన హద్దులు చెరిగిపోతున్నాయనే చెప్పాలి. దర్శకధీరుడు రాజమౌళి అనితర సాధ్యంగా తెరకెక్కించిన బాహుబలి చిత్రానికి దేశవ్యాప్తంగా లభించిన ఆదరణ దక్షిణాది సినిమా సత్తా చాటిచెప్పడమే కాదు.. భారతీయ సినిమా దశ, దిశలను మార్చేసిందని చెప్పాలి. ఈ సినిమా తరువాత దక్షిణాది చిత్రాలతో బాలీవుడ్ సినిమాలు పోటీ పడలేకపోతున్నాయని అక్కడి హీరోలు, దర్శకులు సైతం అంగీకరించక తప్పలేదు. ఇప్పుడు బాహుబలి కథానాయకుడు ప్రభాస్ సినిమాల కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. కేజీఎఫ్ చిత్రంతో కన్నడ హీరో యష్, తాజాగా పుష్ప మూవీతో మన టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు అదే బాటలో పలువురు దక్షిణాది హీరోలు పాన్ ఇండియా స్థాయి సినిమాల్లో నటిస్తూ తమ మార్కెట్ పరిధిని విస్తృతం చేసుకునేందుకు ఉరకలు వేస్తున్నారు. ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రాజమౌళి మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ మూవీ ద్వారా తారక్, చెర్రీ కూడా దేశవ్యాప్త మార్కెట్ ను సాధించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టించనుందోనన్నది ఆసక్తి కరంగా మారింది.