ఎవరూ ఊహించని స్థాయిలో ప్రేక్షకాదరణను సొంతం చేసుకుని ఇండియన్ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న ‘కేజీఎఫ్-2’ కు మరో సీక్వెల్ తెరకెక్కించేందుకు రంగం సిద్ధమవుతోందట. ‘కేజీఎఫ్ చాఫ్టర్-2’ సంచలన విజయాన్ని పురస్కరించుకుని ఓ ప్రముఖ న్యూస్ చానల్ చేసిన ఇంటర్వ్యూలో ఆ చిత్ర నిర్మాత విజయ్ కిరంగదూర్ ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు. ‘కేజీఎఫ్-3’ రావడం ఖాయమేనని, దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ‘సలార్’ చిత్రం షూటింగ్తో బిజీగా ఉన్నారని, ఈ ఏడాది అక్టోబర్ నాటికి అది పూర్తయిన తరువాత ‘కేజీఎఫ్-3’ పట్టాలెక్కే అవకాశం ఉందని ఆయన హోంబళే ఫిల్స్మ్ అధినేత విజయ్ తెలిపారు. 2024లో దీనిని విడుదల చేయాలనుకున్నట్టు ఆయన వెల్లడించారు.
కాగా గత చిత్రాలకంటే రానున్న సీక్వెల్ మరింత భారీగా ఉండబోతున్నట్టు ఆయన సూచనలు ఇచ్చారు. ఇది ‘మార్వెల్ యూనివర్స్ ’ తరహాలో ఉండబోతున్నట్టు తెలిపారు. అంటే ఈ చిత్రంలోని రాకీ తరహాలో ప్రేక్షకుల్లో గుర్తింపు పొందిన విజయవంతమైన చిత్రాల్లోని పాత్రలతో ఈ చిత్ర కథను రూపొందించబోతున్నారన్నమాట. ఇప్పటికే హాలీవుడ్లో ఈ తరహాలో కొన్ని చిత్రాలు వచ్చి విశేషమైన ప్రేక్షకాదరణను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. హీరో యశ్, కేజీఎఫ్ అభిమానులకు మాత్రమే కాదు.. మొత్తం సినీ ప్రేమికులకు మాంచి కిక్ ఇచ్చే వార్త ఇది. అయితే దర్శకుడు ప్రశాంత్నీల్తో సినిమాలు చేసేందుకు ఎదురుచూస్తున్న స్టార్ హీరోలకు మాత్రం కాస్త నిరాశ కలిగించే విషయమేనని చెప్పాలి. ఎందుకంటే అతడి దర్శకత్వంలో నటించాలంటే వారు చాలాకాలం వేచిచూడక తప్పేట్టు లేదు మరి.