జనాభా పెరిగితే వచ్చే నష్టాల గురించి దేశాలు, ప్రజలు పెద్దగా పట్టించుకోకపోవడం అనేది రానున్న దశాబ్దంలో పెను సవాలు విసరనుంది. సురక్షితమైన ఆహారం, నీరు, గాలి కూడా మానవాళికి అందించడం పాలకులకు పెద్ద పరీక్ష కానుంది.
ప్రపంచ జనాభా 7 నుంచి 8 బిలియన్లకు పెరగడానికి 12 సంవత్సరాలు పట్టింది. ఇది 9 బిలియన్లకు చేరుకోవడానికి సుమారు 15 సంవత్సరాలు పడుతుంది. 2037 వరకు ప్రపంచ జనాభా మొత్తం వృద్ధి రేటు మందగిస్తుందని నివేదికలు చెపుతున్నాయి. 2022లో రెండు అత్యధిక జనాభా కలిగిన ప్రాంతాలు ఆసియాలో ఉన్నాయి. తూర్పు, ఆగ్నేయ ఆసియా 2.3 బిలియన్ల జనాభా కాగా, మధ్య, దక్షిణ ఆసియాలో 2.1 బిలియన్ల జనాభా ఉంది. చైనా,భారతదేశాలు ఒక్కొక్కటి 1.4 బిలియన్ల కంటే ఎక్కువ ఎక్కువ జనాభాను కలిగి ఉన్నాయి. జనాభా పెరుగుదల ఇలానే ఉంటే 2030 నాటికి 850 కోట్లు, 2050 నాటికి 970 కోట్లు, 2080 నాటికి 1040 కోట్లకు చేరుకుంటుందని ఐక్యరాజ్య రాజ్య సమితి తెలిపింది. వైద్యం పోషణ వ్యక్తిగత శుభ్రత సహా అనేక రంగాల్లో మానవాళి సాధించిన పురోగతితో అాకాల మరణాలు తగ్గి జీవన ప్రమాణం గణనీయంగా పెరిగింది. మరోవైపు మంది ఎక్కువైతే మజ్జిగ పల్చన.. ఈ సామెత ఊరికే పుట్టలేదు. అలాగే జనం ఎక్కువైతే ఈ భూమిపై ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా ఆహార భద్రత ప్రమాదంలో పడుతుంది. ఆరోగ్య సంరక్షణ మరుగున పడుతుంది. వనరులపై ఒత్తిడి పెరుగుతుంది. భూతాపం అంతకంతకు పెరుగుతోంది. విపత్తులు విరుచుకుపడతాయి. కరువులు విజృంభిస్తాయి. నీటి కొరత ముప్పేట దాడి చేస్తుంది. తినేందుకు తిండే కాదు… తాగేందుకు నీరు కూడా కరువవుతుంది. ఫలితంగా మనుషులు ఒకరిపై ఒకరు దాడి చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే మనుషులంతా సుస్థిరమైన లక్ష్యాలతో పుడమిని కాపాడే ఉమ్మడి బాధ్యత తీసుకోవాలి. మనుషుల అవసరాల కోసం అడవులు నరికి వేయడంతో జంతువుల సంఖ్య తగ్గింది. గత 60 ఏళ్లల్లో అటవీ విస్తీర్ణం 81.7 మిలియన్ హెక్టార్ల మేర తగ్గింది. భూమి పై మూడు వంతుల ప్రాంతం, సాగరాల్లో రెండు వంతుల భాగం మార్పులకు గురయింది. మానవ చర్యల వల్ల 10 లక్షలకు పైగా జీవజాతులు అంతరించే ప్రమాదంలో ఉన్నాయి. ప్రకృతిలోకి అతిగా చొరబడటం వల్ల జనిటిక్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. కొవిడ్19, సార్స్, ఎబోలా ఇందుకు ఉదాహరణలు. పర్యావరణం పట్ల ఇదే నిర్లక్ష్యం కొనసాగితే మానవాళిని ఉక్కిరి బిక్కిరి చేసే అత్యంత ప్రమాదకరమైన వైరస్ లు దాడిచేసి మానవ జీవితాలను అతలాకుతలం చేసే పెను విపత్తు పొంచి ఉంది.. తస్మాత్ జాగ్రత్త…