‘ కరోనా మహమ్మారి ప్రతాపం తగ్గిందని ఊపిరి పీల్చుకోవడానికి లేదు. అది మార్పు చెందుతోంది.. ముగిసిపోలేదు’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 110 దేశాల్లో కేసులు పెరుగుతున్నాయని హెచ్చరించింది.
‘ఈ మహమ్మారి మార్పు చెందుతోంది. కానీ ముగిసిపోలేదు. కొత్త కేసులు రిపోర్టింగ్, జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రక్రియలు తగ్గిపోవడం వల్ల వైరస్ను ట్రాక్ చేయగల సామర్థ్యం ప్రమాదంలో ఉంది. దాంతో ఒమిక్రాన్ను గుర్తించడం, భవిష్యత్తు వేరియంట్ల గురించి విశ్లేషించడం కష్టంగా మారుతోంది. బీఏ.4, బీఏ.5 సబ్ వేరియంట్ల కారణంగా 110 దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి’ అని డబ్ల్యూహెచ్ఓ అధిపతి టెడ్రోస్ అధనామ్ వెల్లడించారు.
మరోవైపు భారత్లో ఈ ఏడాది ప్రారంభంలో వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ కాస్త ఆందోళనకు గురిచేసినా.. ప్రమాదకరంగా మాత్రం మారలేదు. తర్వాత ఆ వేవ్ తగ్గుముఖం పట్టడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కానీ గత కొద్ది రోజులుగా మళ్లీ వైరస్ విస్తరిస్తోంది. తాజాగా 19 వేలకు చేరువగా కొత్త కేసులు వచ్చాయి. దాంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టడి చర్యలవైపు మొగ్గుచూపుతున్నాయి.