అగ్రరాజ్యం అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తన ఆసియా పర్యటనలో భాగంగా తైవాన్ను సందర్శించడం చైనా -అమెరికాల మధ్య మంటలు రగిలిస్తోంది. చాలాకాలంగా తైవాన్ తమ దేశంలో భాగమేనని వాదిస్తూ ఆదేశంపై తమ ఆధిపత్యాన్ని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్న చైనా వైఖరిని అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నవిషయం తెలిసిందే. తైవాన్ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని తరచుగా చెపుతున్న అమెరికా దక్షిణ చైనా సముద్రంలో గతంలోనే యుద్ధ నౌకలనూ మొహరించింది. అయితే ఇదే అంశంపై అమెరికా పై తన అక్కసును వెళ్లగక్కిన చైనా తరచుగా తైవాన్ గగన తలాన్ని అతిక్రమిస్తూ కవ్వింపు చర్యలకూ పాల్పడుతోంది. నిజానికి ఉక్రెయిన్పై రష్యా ఆక్రమణ తరహాలోనే తైవాన్పై చైనా ఎప్పుడైనా దాడి చేయవచ్చన్న అంచనాలు ఉన్నాయి.
కాగా తాజాగా అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ ఆసియా పర్యటనలో తైవాన్ కూడా వెళ్లనున్నట్టు వార్తలు వచ్చినవెంటనే చైనా అమెరికాపై హెచ్చరికలతో కూడిన విమర్శలతో విరుచుకుపడింది. చైనా సార్వభౌమ భద్రతా ప్రయోజనాలకు ఏమాత్రం భంగం కలిగించేలా పెలోసీ వ్యవహరించినా అమెరికా దానికి తగిన మూల్యం చెల్లించక తప్పదని చైనా విదేశాంగశాఖ మంగళవారం హెచ్చరించింది. అంతకుముందే చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, అమెరికన్ ప్రెసిడెంట్ జో బైడెన్తో ఫోన్లో మాట్లాడుతూ తమను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడవద్దని గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
తైవాన్లో అడుగు పెట్టిన నాన్సీ పెలోసీ
అయితే చైనా హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోని పెలోసీ మంగళవారం సాయంత్రం తైవాన్లో అడుగుపెట్టారు. ప్రజాస్వామ్యానికి మద్దతుగా నిలవడంలో అమెరికా నిబద్ధతను తన తైవాన్ పర్యటన చాటుతోందని పెలోసీ ట్వీట్ చేశారు. ఫాసిజం, ప్రజాస్వామ్యాల మధ్య ఏదో ఒకదాన్ని ఎంచుకోక తప్పని పరిస్థితి ఉన్న ఈ సమయంలో 2.3 కోట్ల మంది తైవాన్ ప్రజలకు అమెరికా అండగా నిలుస్తుందన్నారు. తైవాన్ నాయకత్వంతో చర్చలు ఆ దేశానికి తమ మద్దతును పునరుద్ఘాటిస్తాయని, స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ ప్రాంత దేశాల అభివృద్ధి ఉమ్మడి ప్రయోజనాల రక్షణే లక్ష్యంగా సాగుతాయని ప్రకటించారు.
ఒకపక్క చైనా యుద్ధ విమానాల విన్యాసాలు.. తైవాన్ సమీపంలో మోహరించిన అమెరికా యుద్ధ నౌకలు
కాగా పరిణామం ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెంచడంతోపాటు.. అంతర్జాతీయ రాజకీయాల్లోనూ కాకపుట్టిస్తోంది. అమెరికా వైఖరిపై తమ ఆగ్రహాన్ని తెలియజేస్తూ డ్రాగన్ దేశం దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే చైనా యుద్ధ విమానాలు తైవాన్ జలసంధిని దాటినట్టు స్థానికంగా వార్తలు వెలువడుతున్నాయి. చైనా వ్యవహార శైలి ఎలా ఉంటుందో ముందే ఊహించిన అమెరికా నాలుగు యుద్ధ నౌకలను తైపీ సమీపంలోని సముద్ర జలాల్లో మోహరించింది. దీంతో ఏక్షణంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.