ఇంగ్లండ్ ప్రధానమంత్రి పదవికోసం లిజ్ట్రస్- రిషి సునాక్ ల మధ్య జరుగుతున్న పోటీలో భారత సంతతికి చెందిన రిషి ప్రస్తుతానికి ఇంకా వెనుకబడే ఉన్నట్టు తాజా సర్వే వెల్లడించింది. కన్జర్వేటివ్ పార్టీ నేతగా గెలిచినవారే బ్రిటన్ ప్రధాని పదవి అధిష్ఠించగలరన్న విషయం తెలిసిందే. ది అబ్జర్వర్ పత్రికలో ప్రచురితమైన ఓ సర్వే ఫలితాల ప్రకారం లిజ్ట్రస్కు కన్జర్వేటివ్ సభ్యుల్లో ఎక్కువమంది మద్దతు ఉన్నట్టు తేలింది. సర్వేలో పాల్గొన్న 570 మంది పార్టీ సభ్యుల్లో 61 శాతం మంది లిజ్ట్రస్కు అండగా నిలవగా, రిషి సునాక్కు 39 శాతం మద్దతిచ్చారు. అయితే పార్టీ సీనియర్ సభ్యుల్లో ఎక్కువమంది లిజ్ట్రస్కు ఓటువేస్తే, యువతలో మాత్రం రిషి సునాక్ మద్దతు ఉన్నట్టు తేలడం విశేషం. ఈ నేపథ్యంలో రిషీకి ఇంకా అవకాశాలు ఉన్నట్టే భావించాలని అక్కడి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
అయితే మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ ను రాజీనామా చేయాలని గతంలో రిషి సునాక్ డిమాండ్ చేయడం ఆయనకు ప్రస్తుతం ప్రతికూలంగా మారిందని, మాజీ ప్రధాని వర్గం రిషీకి వ్యతిరేకంగా పనిచేస్తోందని పార్టీ వర్గాలు
అభిప్రాయపడుతున్నాయి. కన్జర్వేటివ్ పార్టీ నేతను ఎన్నుకునేందుకు సెప్టెంబర్ 2వ తేదీ వరకు సమయముంది. అప్పటిదాకా పార్టీ సభ్యులు పోస్టల్, ఆన్లైన్ ద్వారా ఓట్లు వేస్తారు. తుది ఫలితం 5వ తేదీన ప్రకటిస్తారు. అదే రోజు గెలిచిన వ్యక్తి ప్రధాని బాధ్యతలు చేపడతారు. అంటే వచ్చే కొద్ది రోజుల్లో రిషి సునాక్ తనకు పార్టీలో మద్దతు పెంచుకునేందుకు గట్టిగానే శ్రమించాల్సి ఉందనుకోవచ్చు.