ఈ ఏడాది ప్రపంచంలో మూడో వంతు దేశాల్లో ఆర్ధిక మాంద్యం ముంచుకొస్తుందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) హెచ్చరింది. గత ఏడాదికంటే 2023 సంవత్సరం ‘కఠినం’గా ఉంటుందని, మూడు పెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, యూరోపియన్ యూనియన్, చైనా ఒకేసారి మందగిస్తాయని ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టలినా జార్జీవా తాజాగా అంచనా వేశారు.
ఒక న్యూస్ ఛానల్తో ఆమె మాట్లాడుతూ.. 10 నెలలు గడిచినా ఉక్రెయిన్ సంక్షోభం సమసిపోయేలా కన్పించడం లేదని, మరోవైపు అధిక ద్రవ్యోల్బణం, గరిష్ఠ వడ్డీ రేట్లు, చైనాలో కరోనా వేవ్ తదితర అంశాలు ఆర్థిక వ్యవస్థల్ని అతలాకుతలం చేస్తున్నాయన్నారు. ‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మూడో వంతు మాంద్యంలోకి జారుకుంటుందని మేము అంచనా వేస్తున్నాం’ అని క్రిసలినా చెప్పారు. ‘మాంద్యంలో లేని దేశాల్లో సైతం కోట్లాదిమంది ప్రజలు మాంద్యంలో ఉన్నట్టే ఉక్కిరిబిక్కిరి అవుతారు’ అంటూ ఐఎంఎఫ్ చీఫ్ వివరించారు. 2023 సంవత్సరపు ప్రపంచ ఆర్థికాభివృద్ధి అంచనాల్ని ఇప్పటికే ఐఎంఎఫ్ తగ్గించింది. 2021లో 6 శాతంగా ఉన్న వృద్ధి రేటు 2022లో 3.2 శాతానికి, 2023లో 2.7 శాతానికి తగ్గుతుందంటూ గత అక్టోబర్లో విడుదల చేసిన అంచనాల్లో పేర్కొంది.
కొవిడ్ వేవ్ కారణంగా చైనాలో వచ్చే రెండు నెలలూ సంక్లిష్టంగా ఉంటుందని, దీంతో ఆ దేశపు వృద్ధి రేటు మైనస్లోకి జారుకుంటుందని, ఫలితంగా ఈ ప్రాంత దేశాలు, ప్రపంచ వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడుతుందని క్రిస్టిలినా ఆందోళన వ్యక్తం చేశారు. 40 ఏండ్లలో తొలిసారిగా 2022లో చైనా వృద్ధి..ప్రపంచ వృద్ధిరేటు కంటే తక్కువ నమోదు కానున్నదని అన్నారు. వాస్తవానికి గ్లోబల్ రేటుతో సమానంగా చైనా వృద్ధి 3.2 శాతంగా ఉంటుందంటూ గత అక్టోబర్లో ఐఎంఎఫ్ వెల్లడించింది. క్రిస్టిలినా తాజా వ్యాఖ్యాల ప్రకారం ఈ నెలలో దావోస్లో విడుదల చేసే తాజా అంచనాల్లో చైనా వృద్ధి రేటులో కోత విధించే అవకాశాలు కన్పిస్తున్నాయి.
అమెరికా తప్పించుకునే ఛాన్స్
అమెరికా మాంద్యాన్ని తప్పించుకునే అవకాశం ఉందని ఐఎంఎఫ్ చీఫ్ చెప్పారు. ఆ దేశంలో ఉపాధి మార్కెట్ పటిష్ఠంగా ఉన్నదని, అయితే నాలుగు దశాబ్దాల గరిష్ఠస్థాయిలో ఉన్న ద్రవ్యోల్బణాన్ని ఫెడ్ తగ్గించేందుకు వడ్డీ రేట్లు పెంచితే అమెరికా వృద్ధికి ముప్పు వాటిల్లుతుందన్నారు. ‘ఒకవైపు చూస్తే ఉద్యోగ నియామకాలు పెరుగుతున్నాయి. మరోవైపు ఫెడ్ వడ్డీ రేట్లు గరిష్ఠస్థాయిలోనే ఎక్కువకాలం కొనసాగేలా ఉంది. ఈ అంశాలు మిశ్రమ సంకేతాలనిస్తున్నాయి’ అని క్రిస్టిలినా వ్యాఖ్యానించారు.