- బ్యాంకులు, కంపెనీలకు రానున్నది మృత్యు కాలం
- ఆర్థికవేత్త నోరియల్ రొబినీ సంచలన ప్రకటన
- 2008 అమెరికా మాంద్యాన్ని చెప్పిందీ ఈయనే
మరో ఆర్థిక మాంద్యం పలు దేశాలను అతలాకుతలం చేయనుంది. కరోనా అంతటి ఆర్థిక విపత్తును ఎదుర్కొనేందుకు అంతా సన్నద్ధంగా ఉండాలని ఆర్ధిక వేత్తలు హెచ్చరిస్తున్నారు.
పలు కార్పొరేట్ సంస్థలు, మహా మహా బ్యాంకులు, బలహీనంగా ఉన్న దేశాలన్నీ ఆర్ధిక మాంద్యంతో కొట్టుమిట్టాడే పెను ప్రమాదం కనుచూపు మేరలో కనిపిస్తోంది. . అ మాటలన్నది మామూలు వ్యక్తి కాదు. ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపేసిన 2008 అమెరికా ఆర్థిక మాంద్యాన్ని ముందుగానే అంచనావేసి హెచ్చరించిన ఆర్థికవేత్త నోరియల్ రొబినీ. డాక్టర్ డూమ్గా పేరు పొందిన రొబినీ.. ఈ ఏడాది చివరలో అమెరికాలో మరో మహా ఆర్థిక మాంద్యం ప్రారంభం కాబోతున్నదని తాజాగా మరో హెచ్చరిక చేశారు. ఈ మాం ద్యం సామాన్యమైనది కాదని.. అత్యంత దారుణంగా, దీర్ఘకాలంపాటు ఉండబోతున్నదని వివరిస్తున్నారు. పెట్టుబడిదారులు, ప్రజలు భారీ విలాసాలకు పోకుండా సంపదను డబ్బు, బంగారం రూపంలో దాచుకోవాలని సూచించారు.
అన్నీ అపశకునాలే
ప్రపంచవ్యాప్తంగా మహా ఆర్థిక మాంద్యం రాబోతున్నదన్న వాదనకు రొబినీ అనేక ఉదాహరణలు చూపారు. గత సోమవారం ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన.. మాంద్యం ఎలా ఉండబోతున్నదో వివరించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, చైనా జీరో కొవిడ్ విధానం, అమెరికా-చైనా మధ్య ఉద్రిక్తతలు, స్టాండర్డ్ అండ్ పూర్-500 (ఎస్అండ్పీ-500) జాబితాలోని కార్పొరేట్ కంపెనీలకు పెరిగిన రుణభారం, అనేక దేశాలు విచక్షణారహితంగా స్థాయికి మించి అప్పులు చేయటం వంటి పరిస్థితులు మాంద్యం రావటానికి ప్రధాన కారణాలని వివరించారు. కంపెనీలు, దేశాల రుణ, వడ్డీల భారం పెరిగిపోవటం వాటి ఉత్పత్తి, నిర్వహణ సామర్థ్యంపై పడుతున్నదని తెలిపారు. వచ్చే డిసెంబర్ నాటికి ఎస్అండ్పీ-500 కంపెనీల విలువ 40 శాతం పడిపోనున్నదని అంచనా వేశారు. దీనివల్ల కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తాయి. మహా మాంద్యం దెబ్బకు జాంబీ సంస్థలు (ఆర్థికంగా దివాళాతీసేస్థితిలో ఉన్నవాటిని జాంబీలు అంటారు), జాంబీ గృహస్థులు (వ్యక్తులు), కార్పొరేట్లు, బ్యాంకులు, షాడో బ్యాంకులు (బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు), జాంబీ దేశాలు (శ్రీలంక వంటి మాంద్యంలో చిక్కుకొన్న దేశాలు) అంతరించిపోతాయని రొబినీ చెప్తున్నారు.
మార్కెట్లు కుప్ప కూలతాయి
మాంద్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా స్టాక్మార్కెట్లు కుప్పకూలే ప్రమాదం ఉన్నదని రొబినీ తెలిపారు. కంపెనీల రుణ స్థాయులు పెరిగిపోవటం స్టాక్ మార్కెట్లను కుంగదీస్తుందని అంటున్నారు. ద్రవ్యోల్బణాన్ని రెండు శాతానికి పరిమితం చేయటం కేంద్ర బ్యాంకులకు అసాధ్యమని తెలిపారు. అమెరికా రిజర్వ్ బ్యాంకు ఈ నెలలో వడ్డీ రేటును 75 బేసిక్ పాయింట్లు, నవంబర్, డిసెంబర్లో 50 బేసిక్ పాయింట్ల చొప్పున పెంచే అవకాశం ఉన్నదని అంచనా వేశారు. దీని వల్ల ఈ సంవత్సరం చివరి నాటికి వడ్డీ రేటు 4-4.25 మధ్య ఉంటుందని, ఇది సేవలరంగంపై.. ఉద్యోగ సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని చెప్పారు. ఒకవైపు వడ్డీరేట్లు పెరగటం, మరోవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల దిగుమతి చేసుకొనే వస్తువుల రేట్లు కూడా పెరగిపోవటం వంటి పరిస్థితులు ఆర్థిక వ్యవస్థలను మాంద్యంలోకి నెట్టేస్తాయని పేర్కొన్నారు. మాంద్యం దెబ్బ 2023 చివరి వరకూ కొనసాగే ప్రమాదం ఉన్నదని వెల్లడించారు.
ఉద్దీపనలూ పనిచేయవు
ఆర్థిక మాంద్యం సమయంలో సాధారణంగా ప్రభుత్వాలు పరిశ్రమలకు ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించి ఆదుకొంటాయి. అంటే కంపెనీలకు సులభంగా నిధులు లభించే వెసులుబాటు చేస్తాయి. కానీ, ఇప్పుడు రాబోయే ఆర్థిక మాంద్యం ఉద్దీపన ప్యాకేజీలతో కూడా ఆగదని రొబినీ చెప్తున్నారు. అసాధారణ స్థాయిలో ఉద్దీపనలు ఇవ్వటంవల్ల ప్రభుత్వాల వద్ద ఉన్న నిధులు కూడా కరిగిపోతాయని తెలిపారు. ఆర్థిక వ్యవస్థలోకి అతిగా ధనాన్ని చొప్పించటం వల్ల సమిష్టి డిమాండ్ పెరిగి ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుందని, ఇదొక విష వలయమని పేర్కొన్నారు. మొత్తంగా ఆర్థిక వ్యవస్థల్లో 1970ల నాటి జడత్వం ఏర్పడబోతున్నదని తెలిపారు. రొబినీ ఇటీవల రాసిని ‘మెగాత్రెట్’ అనే పుస్తకంలో రాబోయే మాంద్యం గురించి వివరంగా చర్చించారు.