నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటన తరువాత ఆగ్రహంతో రగిలిపోతున్న చైనా తన సైనిక శక్తి ఏంటో చాటేందుకు సిద్ధమవుతున్నట్టే కనిపిస్తోంది. తైవాన్ ను తన నియంత్రణలోకి తెచ్చుకోవడమే లక్ష్యంగా డ్రాగన్ దేశం తైవాన్ ద్వీపం చుట్టూ ఉధృతంగా సైనిక విన్యాసాలు చేస్తోంది. తైవాన్ జలసంధిని దిగ్బంధించడమే లక్ష్యంగా డ్రాగన్ తన యుద్ద విమానాలు, డిస్ట్రాయర్ నౌకలను మోహరించడంతో అంతకంతకూ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.
అంతేకాదు.. తన సామర్థ్యాన్ని చాటుకుంటున్నట్టుగా చైనా అధికార మీడియా గ్లోబల్ టైమ్స్ ఓ వీడియోను షేర్ చేసింది. హాలీవుడ్ యాక్షన్ మూవీ ని తలపించేలా ఉన్న ఈ వీడియోలో 100కు పైగా యుద్ద విమానాలు, కొత్త తరం రిఫ్యూయలర్ వైయూ-20ల ఆవిష్కరణ, పదికి పైగా డిస్ట్రాయర్లతో సైనిక విన్యాసాలు కొనసాగుతున్నట్టు ప్రపంచానికి తెలిపింది.
కాగా వాయు, సముద్ర మార్గాల్లో తైవాన్ను కమ్ముకొస్తూ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చేస్తున్నయుద్ధ విన్యాసాలను వెంటనే నిలిపివేయాలని అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్లు బీజింగ్ను సూచించాయి. అయితే ఆ దేశాల మాటను ఎంతమాత్రం వినేదే లేదన్నట్టుగా చైనా చెలరేగిపోతోంది. తన హెచ్చరికలను లెక్క చేయకుండా పెలోసీకి ఆతిథ్యమిచ్చిన తైవాన్ను శిక్షించాలని, అదే సమయంలో పెద్దన్న అమెరికాకు కూడా తాను ఏం చేయగలదో చెప్పాలని భావిస్తోంది.