బ్రిటన్ ప్రధాని పదవి రేసులో ఓ భారతీయ వ్యక్తి పేరు ప్రముకంగా వినిపిస్తుంది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా చేసిన తర్వాత ఆ స్థానాన్ని, కన్సర్వేటివ్ పార్టీ నేత పదవిని ఎవరు భర్తీ చేయబోతున్నారనే ప్రశ్నకు సమాధానంగా మాజీ మంత్రి రిషి సునాక్ పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుతం రేసులో తొమ్మిది మంది ఉన్నారు. విశ్వాసాన్ని తిరిగి పొంది, ఆర్థికంగా పునర్నిర్మించడానికి, దేశాన్ని ఐక్యంగా ఉంచడానికి కృషి చేస్తానని సునాక్ చెబుతున్నారు. ప్రధాని పదవి అవకాశం తనకు వస్తే ఎలాంటి ప్రణాళిక అమలు చేస్తాననే విషయాన్ని ఇంకా వెల్లడించకపోయినా, పన్నుల్లో కోత గురించి మాత్రం ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. పన్ను విషయాల్లో ఆయన్ని నమ్మలేమనీ, ఆయనొక అబద్ధాల కోరు అని వ్యక్తిగత విమర్శలూ ప్రసార మాధ్యమాల్లో మొదలయ్యాయి. భార్య అక్షతా మూర్తికి సంబంధించిన పన్ను వివాదాలను ప్రస్తావిస్తూ.. బాహాటంగా ఆయన అబద్ధాలు చెప్పారని ఒక వర్గం విమర్శిస్తోంది. సునాక్ వైపు ఎక్కువమంది మొగ్గు చూపిస్తుండగా వాణిజ్య శాఖ సహాయ మంత్రిగా వ్యవహరించిన పెన్నీ మాడెంట్ ఆ తర్వాతి స్థానంలో నిలుస్తున్నారు. రిషి సునాక్ ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నారాయణ మూర్తి అల్లుడు.