హైదరాబాద్ నగరం అంతర్జాతీయంగా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన నగరాల జాబితాలో చోటు దక్కించుకుంది. ఈ భాగ్యనగరిలో మొత్తం 11100 మంది మిలియనీర్లు ఉన్నట్టు హెన్లీ అండ్ పార్ట్నర్స్ వెల్లడించింది.2012-22 మధ్య హైదరాబాద్ నగరంలో అత్యధిక నికర సంపదగల వ్యక్తుల సంఖ్య 78 శాతం పెరగడం గమనార్హం.
ఈ జాబితాలో అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్ సిటీ తొలి స్థానంలో నిలిచింది. గత 2022 డిసెంబరు 31వ తేదీ నాటికి మహానగరంలో 3.40 లక్షల మంది మిలియనీర్లు ఉన్నారని హెన్లీ అండ్ పార్ట్నర్స్ నివేదిక వెల్లడించింది. ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల నివేదిక 2023లో ఈ కంపెనీ తాజాగా విడుదల చేసింది. ఇందులో మొత్తం 97 పట్టమాలు చోటు దక్కించుకోగా వీటిలో ఒకటి హైదరాబాద్ నగరం నిలిచింది.
ఇకపోతే జపాన్ రాజధాని టోక్యో నగరంలో 2.90 లక్షల మంది మిలియనీర్లతో రెండో స్థానంలో నిలిచింది. శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియా 2.85 లక్షల మంది మిలియనీర్లతో మూడో స్థానంలో నిలిచింది. అలాగే, లండన్లో 2.58 లక్షల మంది, సింగపూర్లో 2.40 లక్షలమంది, లాస్ ఏంజెల్స్లో 2.05 లక్షల మంది, బీజింగ్లో 1.28 లక్షల మంది, షాంఘైలో 1.27 లక్షల మంది, సిడ్నీలో 1.26 లక్షల మంది చొప్పున మిలియనీర్లు ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.