రోజు 10.8 గ్రాముల నుంచి 11.50 గ్రాముల ఉప్పు వాడుతున్నారన్న డబ్ల్యూహెచ్ఓ
హఠాన్మరణాలకు ఇదే కారణమన్న టెడ్రోస్ అథనోమ్
”గుండెపోటు మరణాలకు కరోనా వ్యాక్సిన్ ఒక ప్రధాన కారణమని ఇటీవల వరకు అంతా భావిస్తున్నారు. అయితే దీని మాటెలా ఉన్నా..కోవిద్ టైంలో ఇంట్లో ఉంటూ .. నోటికి రుచైనవి ఆరగించాం. అందులో టెస్ట్ కోసం ఉప్పు కూడా ఎక్కువగానే వాడేసాము.. అది కూడా గుండెపోటు మరణాలకు ఓ కారణమే .. ఎందుకు కాకూడదు…”
ఇటీవల కాలంలో గుండెపోటుతో హఠాన్మరణాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఇది ఏ ఒక్క ప్రాంతానికో చెందిన సమస్య కాదు. ప్రపంచవ్యాప్తంగా హార్ట్ అటాక్ లతో అత్యధిక సంఖ్యలో మరణాలు చోటుచేసుకుంటుండడం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిణామాలపై డబ్ల్యూహెచ్ఓ నివేదిక వెలువరించింది.
ఉప్పు అధికంగా వాడడం వల్లే గుండెపోట్లు వస్తున్నాయని వెల్లడించింది. సోడియం (ఉప్పు) మోతాదు హెచ్చితే అనారోగ్య సమస్యలు వస్తాయని వివరించింది. మితిమీరిన ఉప్పు వాడకం వల్ల గుండెపోటు మాత్రమే కాకుండా… ఊబకాయం, బోలు ఎముకల వ్యాధి, గ్యాస్ట్రిక్ క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు కూడా వస్తాయని సదరు నివేదిక చెబుతోంది.
2025 నాటికి ప్రపంచంలో సోడియం వినియోగాన్ని తగ్గించాలన్న లక్ష్యం ఆచరణలో కనిపించడంలేదని డబ్ల్యూహెచ్ఓ విచారం వ్యక్తం చేసింది. ఉప్పు వాడకం తగ్గిస్తే 2030 నాటికి 70 లక్షల మంది ఆరోగ్యాన్ని కాపాడవచ్చని డబ్ల్యూహెచ్ఓ నివేదిక చెబుతోంది. అయితే సోడియం విషయంలో డబ్ల్యూహెచ్ఓ సిఫారసులను ప్రపంచంలో కేవలం 9 దేశాలే అమలు చేస్తున్నాయి.
అయితే మనం ఉప్పు .. అంటే కూరల్లో వాడేదే అనుకుంటాం.. ఇటీవల ఫాస్ట్ ఫుడ్ కల్చర్ ఎక్కువయింది. బయట తినే పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్,, పిల్లలు అమిత ఇష్టంగా తింటున్న కుర్ కురేలు, వంటి వాటిలో చైనా సాల్ట్ విపరీతంగా వాడుతున్నారు. అది ఇప్పటికిప్పుడు కాకపోయినా కొన్ని సంవత్సరాలలో మీ గుండె గదుల్ని నాశనం చేస్తుందని గుర్తుంచుకోవాలి కదా…
డబ్ల్యూహెచ్ఓ నిర్దేశించిన ప్రమాణాల మేరకు రోజుకు సగటున 5 గ్రాముల ఉప్పు (సోడియం) మాత్రమే తీసుకోవాలి. కానీ, అందుకు విరుద్ధంగా ప్రపంచంలో సగటున 10.8 గ్రాములు నుంచి 11.50 గ్రాముల వరకు ఉప్పు తీసుకుంటున్నట్టు వెల్లడైంది. హఠాన్మరణాలకు ఇటువంటి అనారోగ్యకర ఆహారపు అలవాట్లే కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి టెడ్రోస్ అథనోమ్ తాజాగా స్పష్టం చేసారు.