ప్రపంచాన్ని మరో వింతవైరస్ భయపెట్టనుందా? కరోనాను మించి ఆ వైరస్ నష్టాన్ని కలిగిస్తుందా? ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు తీవ్ర అప్రమత్తంగా ఉండాలా? అంటే అవును.. కచ్చితంగా నిజమే అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO). ప్రపంచమంతా అంటువ్యాధులు ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే కరోనా వైరస్, మంకీపాక్స్ వంటి వ్యాధులు ప్రబలంగా విస్తరిస్తున్నాయి. రానున్న రోజుల్లో మరో మహమ్మారి ముప్పు పొంచివుందనే భయాలు ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని దేశాలు ఎదుర్కొంటున్న వైరస్ ల గురించి తెలుసుకోవాలి.
బ్రిటన్లో అంటువ్యాధులు..
ముఖ్యంగా బ్రిటన్లో మురుగునీటి నమూనాల్లో ఇటీవల పోలియోవైరస్ గుర్తించారు.పోలియోను ఎదుర్కొనే వ్యాక్సిన్ విస్తృతంగా పంపిణీ చేసినందున పోలియో వ్యాప్తించే ప్రమాదమేమీ లేదని అక్కడి అధికారులు పేర్కొంటున్నారు. కరోనా వైరస్తో వణికిపోయిన బ్రిటన్లో ఇటీవల మంకీపాక్స్ వ్యాధి కలవరపెడుతోంది. ఇప్పటికే దాదాపు వెయ్యి కేసులు నిర్ధారణకాగా గుర్తించనివి మరిన్ని ఉండవచ్చని అధికారులు అంటున్నారు. ఈ వ్యాధికంటే ముందు క్రిమియన్-కాంగో జ్వరం, అలాగే లాస్సా ఫీవర్, బర్డ్ ఫ్లూ వంటి కేసులు కూడా బ్రిటన్ను పట్టిపీడించాయి. ఇలా వరుసగా అంటువ్యాధులు వెలుగు చూస్తుండడంపై నిపుణులు కొన్ని హెచ్చరికలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఇవి మరింత ప్రబలే ప్రమాదముందని అప్రమత్తం చేస్తున్నారు. ఇలా వరుస అంటువ్యాధులు వెంటాడుతున్న తరుణంలో డిసీజ్ ఎక్స్ వంటి కొత్త వ్యాధికారకాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని వైద్య నిపుణులు అక్కడి ప్రభుత్వానికి సూచించారు.
డిజీజ్ X .. అంటే ఏమిటి?
డిజీజ్ ఎక్సలో X అంటే భవిష్యత్తులో ఉద్భవించే మహమ్మారికి కారణమయ్యే వ్యాధికారకాలను సూచిస్తుంది. దీనివల్ల ప్రపంచస్థాయిలో తీవ్రమైన అంటువ్యాధులు సంభవిస్తాయి. అది ఏ రకమైన వ్యాధి అనే విషయం కచ్చితంగా తెలియదు. కాని వ్యాధి తీవ్రత మాత్రం అధికంగా ఉంటుంది. ఇదే విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా ఇటీవల ప్రస్తావించింది. ‘డిజీజ్ ఎక్స్’ అనేది ఊహించని, ప్రస్తుతానికి ఊహాజనితమైన, అంటువ్యాధి. అది ఒకవేళ సంభవిస్తే మాత్రం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర వ్యాధికి దారితీస్తుందని శాస్త్రవేత్తలు, ప్రజారోగ్య నిపుణులు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో రెండురకాల కరోనా వైరస్లు, ఇంకా గుర్తించబడని ‘డిజీజ్ ఎక్స్’తోపాటు ప్రాధాన్యం కలిగిన వ్యాధులను అంచనా వేసేందుకు పరిశోధక రోడ్మ్యాపులు, ప్రయోగ నమూనాలను అభివృద్ధి చేశాం’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (మార్చి నెలలో) వెల్లడించింది.
కరోనా కంటే దారుణంగా…
జంతువుల నుంచి మానవులకు సోకే ఎన్నో వ్యాధులు రానున్న రోజుల్లో విరుచుకుపడొచ్చని గతంలో ఎంతోమంది నిపుణులు స్పష్టంగా పేర్కొన్నారు. ’21వ శతాబ్దం ఆరంభంలో అంటువ్యాధులు ఓ తుపానులా విరుచుకుపడ్డాయి. రానున్న రోజుల్లోనూ ఇవి మరింతగా వ్యాప్తిచెందే ఆస్కారం ఉందని సూచిస్తున్నాయి’ అని బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ ఈడెన్బర్గ్కి చెందిన ఎపిడమాలజీ నిపుణులు ప్రొఫెసర్ మార్క్ వూల్హౌజ్ పేర్కొన్నారు.
మనం సరికొత్త రోగకారక జీవుల యుగంలో జీవిస్తున్నామని.. డిజీజ్ ఎక్స్ కూడా అందులోని భాగమేనంటూ 1976లో ఎబోలాను కనుక్కోవడంలో కీలకపాత్ర పోషించిన ప్రాఫెసర్ జీన్జాక్యూస్ ముయేంబే టామ్ఫమ్ గతేడాదే హెచ్చరించారు. ఇటువంటి పరిణామాలు మానవాళికి ముప్పు కలిగించేవేనని ఆందోళన వ్యక్తం చేశారు. కొవిడ్ కంటే వినాశకరమైన కొత్త వ్యాధులు ఉద్భవిస్తాయా అనే ప్రశ్నకు బదులిచ్చిన ఆయన.. అటువంటివి కచ్చితంగా వస్తాయనే తాను భావిస్తున్నానని చెప్పారు. ఏదేమైనా భవిష్యత్తులో ఉద్భవించే వ్యాధికారకాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.