దేశంలో మరోసారి కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుంది. 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్నవారికి కోవిడ్ వ్యాక్సిన్ మూడో డోసును ప్రభుత్వ కేంద్రాల్లోనే ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లవుతున్న సందర్భంగా ఈ ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా ఈ నెల 15న మొదలుపెట్టి 75 రోజులపాటు నిర్వహించనున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెపుతున్నాయి. అత్యధిక శాతం ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందించిన దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉన్న విషయం తెలిసిందే. అధికారిక లెక్కల ప్రకారం అర్హులైన వారిలో ఇప్పటిదాకా 96 శాతం మంది ఒక డోసు తీసుకోగా, సుమారు 87 శాతం మందికి రెండు డోసులు అందించారు.
రెండు డోసులు తీసుకున్నా 6 నెలల తరువాత వ్యాక్సిన్ల కారణంగా ఉత్పత్తి అయ్యే యాంటీ బాడీల ప్రభావం క్షీణిస్తున్నట్టు దేశీయ, అంతర్జాతీయ వైద్య పరిశోధనా సంస్థల నివేదికలు వెల్లడిస్తున్నాయి. మరోపక్క కోవిడ్ మహమ్మారి ఇప్పటికీ పలు దేశాల్లో ఉనికిని చాటుకుంటూనే ఉన్న విషయం తెలిసిందే. దేశంలోనూ కొద్దిరోజులుగా మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా కేంద్రం బూస్టర్ డోసు అందించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే బూస్టర్ డోసు తీసుకునేందుకు ఎంతమంది సుముఖత వ్యక్తం చేస్తారన్నది చెప్పలేని పరిస్థితి ఉంది.