ప్రపంచమంతా ప్రాణాంతక వ్యాధిగా భయపడుతున్న క్యాన్సర్ ను గుర్తించడం, చికిత్స చేయడంలో శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. క్యాన్సర్కు కారణమయ్యే 58 జన్యు సంకేతాలను తమ సుదీర్ఘ పరిశోధనల్లో కొత్తగా గుర్తించారు. ఈ వివరాలను ‘సైన్స్ జర్నల్’లో ప్రచురించారు. ఆ పరిశోధన పాత్రలలో సమాచారం బహిర్గతమైంది.
పొగతాగడం, అతినీలలోహిత కిరణాలు తదితర కారణాల వల్ల శరీరంలో జరిగే జన్యుమార్పులకు సంబంధించి ఇప్పటివరకు 51 జన్యు సంకేతాలు మాత్రమే శాస్త్రవేత్తలకు తెలుసు. అయితే, వైద్య రంగానికి ఇంతవరకు తెలియని అత్యంత కీలకమైన క్యాన్సర్ కారకాలు మరెన్నో ఉన్నాయి. తాజా పరిశోధన ఫలితాలతో వాటిలో మెజార్టీ రకాల గుట్టు రట్టయింది.
జన్యు మార్పులపై పరిశోధన
ఇంగ్లండ్లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు 8వేల మందికి పైగా క్యాన్సర్ పేషేంట్స్ పై అధ్యయనం చేసారు. వారి యొక్క క్యాన్సర్ కణితిల్లోని జన్యు మార్పులను విశ్లేషించారు. క్యాన్సర్కు కారణమవుతున్న 58 జన్యు సంకేతాల రహస్యాలు బయట పెట్టారు. ఈ సంకేతాల అధారంగా క్యాన్సర్ కారకాలను గుర్తించడంతో పాటు కొత్త చికిత్స విధానాలను అభివృద్ధి చేయవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. క్యాన్సర్ కారక జన్యుమార్పులపై అధ్యయనానికి ఈ ఫలితాలు ఎంతగానో దోహదం చేస్తాయని పేర్కొన్నారు. క్యాన్సర్ రహిత ప్రపంచసాధనకు తాజా ఫలితాలు కీలకమని చెప్పారు.
క్యాన్సర్ కణితి పెరుగుదల గమనించే పద్దతి
క్యాన్సర్ నివారణకు ప్రపంచ వ్యాప్తంగా లేటెస్ట్ చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటి వరకు కొంత మందిలో చికిత్స తర్వాత కూడా మళ్లీ క్యాన్సర్ కణితిలు పెరిగే ప్రమాదం పొంచి ఉంటుంది. చికిత్స అనంతరం తిరిగి కణితులు ఏర్పడే అవకాశాలను అత్యంత కచ్చితంగా అంచనా వేసే సిస్టం తెలిసే విధంగా ఇంగ్లండ్ శాస్త్రవేత్తలు, వైద్యు నిపుణులు ఆక్టపస్-ఏఐ అనే పరికరాన్ని తయారు చేశారు. ఇది కృత్రిమ మేధ సాయంతో పనిచేస్తుంది. క్యాన్సర్ రోగులపై నిఘాకు, క్యాన్సర్ మరణాలను తగ్గించేందుకు, సకాలంలో చికిత్స అందించేందుకు ఈ పరికరం చాలా దోహదపడుతుంది.
స్థూలకాయంతో క్యాన్సర్ ప్రమాదం !
స్థూలకాయంతో బాధపడే మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఇతరులతో పోలిస్తే రెండింతలు ఎక్కువగా ఉంటుందని తాజా అధ్యయనంలో స్పష్టం అయింది. ఇంగ్లండ్లోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ శాస్త్రవేత్తలు.. ఆస్ట్రేలియా, బెల్జియం, జర్మనీ, పోలాండ్, స్వీడన్, యూకే, అమెరికాలోని లక్షా 20 వేల మంది స్థూలకాయులను పరీక్షించగా, అందులో 13 వేల మంది గర్భాశయ క్యాన్సర్తో బాధపడుతున్నట్టు రుజువయింది.
క్యాన్సర్ ఎందుకు వస్తుంది?
క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం మన ఆహార అలవాట్లు. నూనెలో వేయించిన చిప్స్, వడియాలు, పిండి వంటలు వంటివి ఎక్కువగా తినడం ఒక కారణం. రంగులు వేసిన స్వీట్స్, బేకరీ ఉత్పత్తులు, నూడిల్స్ వంటి ఫాస్ట్ ఫుడ్స్, రసాయన అవశేషాలు ఎక్కువగా ఉంటున్న కూరగాయలు, పండ్లు రెగ్యులర్ గా తినడం కూడా క్యాన్సర్ కు బలమైన కారణమే. పంచదార, బెల్లం వంటి అత్యధిక ఉష్టోగ్రతల వద్ద తయారయ్యే పదార్దాలను.. వినియోగించేటపుడు మళ్ళీ వేడి చేయడంతో వాటిల్లో ప్రీ రాడికల్స్ ఏర్పడతాయి. ఉదాహరణకు టీ, కాఫీ, పాలల్లో పంచదార వేసుకుని తాగడం కూడా ప్రమాదమే. నిల్వ పచ్చళ్ళు, కార్బో హైడ్రాట్స్, ఉప్పు ఎక్కువగా ఉన్న పదార్థాలు తినడం కూడా డేంజరే. 2 నుంచి 3 శాతం మందిలో జనిటికల్ గానూ కేన్సర్ ముప్పు పొంచి ఉంటుంది. పండ్లు, బియ్యం, పప్పులు వంటి ఇతర ఆహార పదార్దాలు నిల్వ ఉండటం కోసం వాడే రసాయనాలతో కూడా కేన్సర్ ప్రమాదం పొంచి ఉంటుంది. వీటన్నింటి కంటే మాడిన రొట్టెలు, 150 నుంచి, 200 డిగ్రీల ఉష్టోగ్రత లో వేగిన పిండి వంటలు, స్వీట్స్ ఎక్కువగా తినడం, ఫంగస్ పట్టిన ఎండు మిరప కారం తో తయారైన పచ్చళ్ళు, ఇతర పదార్దాలు తినడం కూడా కేన్సర్ సోకడానికి ముఖ్య కారణాలే.. అని గమనించాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.