బిపి లో తూర్పు గోదావరి. (31.60%). షుగర్ లో కృష్ణ జిల్లా (30.53%) మొదటి స్థానాల్లో ఉన్నాయి.
“డబ్బు ఎక్కువ ఉంటే జబ్బులు వస్తాయా? డబ్బుతో పాటే జబ్బులు వెంటే వస్తాయ్. ఈ స్టడీ పరిశీలిస్తే మాత్రం నిజమేమో అనిపిస్తుంది. దేశంలోనే రక్తపోటు (బిపి), షుగర్ (డయాబెటిస్) వ్యాధులకు కేరాఫ్ గా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఏడెనిమిది దశాబ్దాలుగా ఆర్థిక పరిపుష్టితో ఉన్న గుంటూరు, కృష్ణ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో డబ్బుతో పాటు జబ్బులు కూడా పోటీపడుతున్నాయి. రాష్ట్రంలో పై నాలుగు జిల్లాల్లో రక్తపోటు, షుగర్ పేషేంట్స్ సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఈ ప్రాంతాలలో ఆహార అలవాట్లే ఇందుకు ప్రధాన కారణం. ముందు నుంచీ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రుచులు ఎక్కువే. ఆహార అలవాట్లే రోగాలకు కారణమే కదా.
కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సూచన మేరకు .. గడచిన ఏడాది.. (మార్చి 31, 2022 వరకు) ఆంధ్ర ప్రదేశ్ వైద్య శాఖ వారు ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు. ఏపీలో 50 లక్షల, 10 వేల, 708 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఆశ్చర్య, ఆందోళనకర అంశాలు బయట పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ లో యావరేజ్ రక్తపోటు 26.07%, షుగర్ 26.40% కాగా, కృష్ణా, గోదావరి నదీ తీరాలలో ఉన్న నాలుగు జిల్లాలలో మాత్రం 30% పేషేంట్స్ ఉన్నట్లు తాజా పరీక్షల నూతన గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
షుగర్ వ్యాధి గ్రస్తులలో నెంబర్ వన్ స్తానం కృష్ణా జిల్లా దక్కించుకుంది. కృష్ణా జిల్లాలో 4,83,221 మందిని పరీక్షించగా 1,51,347 మందికి రక్తపోటు.. 31.32%, 1,47,547 మందికి షుగర్ ,, 30.53% బయటపడ్డాయి. గుంటూరు జిల్లాలో 4,73,640 మందికి టెస్ట్ లు నిర్వహించగా.. 1,44,212 మందికి బిపి (30.45%), 1,41,222 మందికి .. (29.82%) డయాబెటిస్ ఉన్నట్లు నిర్దారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో 4,82,634 మందికి బిపి, షుగర్ టెస్ట్ లు చేసారు. ఇందులో 1,52,518 మందికి బిపి, (31.60%), 1,44,188 మందికి షుగర్ (29.88%) ఉన్నట్లు తేలింది. అంటే బీపీలో తూర్పు గోదావరి నెంబర్ వన్ లో ఉందన్న మాట. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో 4,66,635 మందిని పరీక్షించగా.. 1,37,578 మందికి (29.45%), బిపి, 1,31,848 మందికి (28.26%) షుగర్ ఉన్నది.
ఆంధ్రాలో షుగర్ బాగా తక్కువ ఉన్న జిల్లా కర్నూలు. 2,69,437 మందికి బిపి, షుగర్ టెస్టులు చేసారు. ఇందులో 53,043 మందికి బిపి (19.69%), 51,353 మందికి (19.06%) షుగర్ ఉన్నట్లు తేలింది. అంటే పై నాలుగు జిల్లాలతో పోలిస్తే.. కర్నూలు లో బిపి, షుగర్ పేషేంట్స్ 10 శాతం తక్కువ ఉన్నట్లే కదా. కర్నూలులో జొన్న రొట్టెలు, రాగి ముద్దలు తినే వారి సంఖ్య ఇంకా ఉంది కాబట్టే ఇక్కడ కొంతలో కొంత బిపి, షుగర్ జంట జబ్బులు తక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు.