- ప్రపంచవ్యాప్తంగా 84 లక్షల డయాబెటిస్ బాధితులు
- మూడవ స్థానంలో భారత్
- 2040 నాటికి 1.74 కోట్లకు!
- సిడ్నీ వర్సిటీ సర్వేలో వెల్లడి
తిందామంటే తిననివ్వదు.. కానీ, ఆకలి మీద ఆకలి. ఓ గంట సేపు కూర్చుందామంటే సరిగా కూర్చోనివ్వదు. కంటి చూపు సరిగా కనిపించదు, గుండె టపటపా కొట్టుకుంటుంది.. చక్కెర వ్యాధితో వచ్చిన చిక్కులివి. ఈ చిక్కులు భారత్తో పాటు పది దేశాలకు ఎక్కువగా ఉన్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. ముఖ్యంగా టైప్-1 మధుమేహం చాప కింద నీరులా వ్యాపిస్తున్నదని హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధిబారిన పడ్డవారి సంఖ్య 84 లక్షలకు చేరిందని ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివర్సిటీ సర్వేలో తేలింది. అందులో అమెరికా, భారత్, బ్రెజిల్, చైనా, జర్మనీ, యూకే, రష్యా, కెనడా, సౌదీ అరేబియా, స్పెయిన్ దేశాలు తొలి పది స్థానాల్లో ఉన్నాయని వెల్లడైంది. 2040 నాటికి వ్యాధిగ్రస్తుల సంఖ్య కోటి 75 లక్షలకు చేరే ప్రమాదం ఉన్నదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ ప్రమాదానికి అడ్డుకట్ట వేయాలంటే ఆరోగ్య వ్యవస్థ పటిష్టం కావాలని తెలిపారు. అన్ని దేశాల్లో 100 శాతం చికిత్స విధానాలు అందుబాటులోకి రావాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న మొత్తం కేసుల్లో 21 శాతం మంది అల్పాదాయ, మధ్యాదాయ దేశాలకు చెందినవారేనని వివరించారు. ఈ వ్యాధితో 2021లో 1.75 లక్షల మంది మరణించారని పేర్కొన్నది.