దక్షిణాదిలో కర్నాటక తరువాత కాషాయ జెండా ఎగిరేది తెలంగాణలోనే అని గట్టి నమ్మకంతో ఉన్న బీజేపీ ఆదిశగా స్పష్టమైన కార్యాచరణతోనే ముందుకు వెళుతున్నట్టు కనిపిస్తోంది. హైదరాబాద్లో ఆదివారం బీజేపీ అట్టహాసంగా నిర్వహించిన విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ తెలుగులోనే సభకు హాజరైనవారిని పలకరించి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సోదర, సోదరీమణులారా అంటూ ఆయన ప్రసంగం మొదలు పెట్టడంతో సభా ప్రాగణమంతా దద్దరిల్లింది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావచ్చని ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో దాదాపు ఎన్నికల సభను తలపించిన ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ… తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు లేవనెత్తకుండా, కేంద్రం తెలంగాణకు ఎన్నివిధాలుగా సహాయ సహకారాలు అందిస్తోందీ లెక్కలతో సహా తెలియజేశారు.
తద్వారా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని కేసీఆర్ చేస్తున్న విమర్శలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు రావడం ఖాయమని ప్రధాని చెప్పారు. సభ విజయవంతం కావడానికి సహకరించిన పార్టీ కార్యకర్తలను మోదీ అభినందించారు. తెలంగాణ మొత్తం ఈ గ్రౌండ్లో కూర్చున్నట్లుందన్నారు. ప్రతిభకు హైదరాబాద్ పట్టం కడుతుందని తెలిపారు. తెలంగాణ మరింత ప్రగతి పథంలో దూసుకుపోయేలా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ పని చేస్తుందని మోదీ పేర్కొన్నారు.
అంతకుముందు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు సభలో మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబ పాలనకు చరమ గీతం పాడాలని ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని, కేసీఆర్ ఫాంహౌస్ నుంచే ఎనిమిదేళ్లుగా పరిపాలన సాగిస్తున్నారని విమర్శలు గుప్పించారు. దుబ్బాకలో బీజేపీ గెలుపుతో కేసీఆర్కు మతిపోయిందని, హుజుర్నగర్ గెలుపుతో కేసీఆర్ కు భయం పట్టుకుందన్నారు.
ఇటీవల కాలంలో ప్రధాని మోదీ పైన, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపైన సీఎం కేసీఆర్ విమర్శలతో విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న యశ్వంత్ సిన్హాను హైదరాబాద్కు ఆహ్వానించిన కేసీఆర్ ఆయనకు పార్టీ నేతలతో కలిసి సన్మానం చేసిన సందర్భంగా ప్రధాని మోదీ కార్పొరేట్ల సేల్స్మెన్లా పని చేస్తున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఈ విమర్శలకు ఇతర నేతలు ఘాటుగానే సమాధానమిచ్చినా.. ప్రధాని మోదీ మాత్రం కేసీఆర్పై వ్యక్తిగతంగా ఎలాంటి విమర్శలకు తావివ్వకుండా బీజేపీ ప్రభుత్వం వస్తే కలిగే ప్రయోజనాలను మాత్రమే వివరిస్తూ వ్యూహాత్మకంగా మాట్లాడటం విశేషం.