మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ రాజకీయ వ్యూహాలు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు టెన్షన్ పుట్టిస్తున్నాయి. తెలంగాణలో గ్రామ స్థాయి వరకు బలమైన క్యాడర్ కలిగి దశాబ్దాల పాటు రాజకీయ ఆధిపత్యాన్ని చలాయించిన కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ తన రాజకీయ చతురతతో గత రెండు ఎన్నికల్లోనూ ప్రతిపక్ష స్థానానికి పరిమితం చేయగలిగారు. ఇక ముఖ్యమంత్రిగా తాను అమలు చేసిన రైతు బంధు వంటి సంక్షేమ పథకాలు, ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి పూర్తిచేసిన కాళేశ్వరం వంటి భారీ నీటిపారుదల ప్రాజెక్టులు తెలంగాణలో టీఆర్ఎస్ అధికారాన్నిసుస్థిరం చేస్తాయని ఆయన గట్టి నమ్మకం పెట్టుకున్నారు. అసలు బీజేపీ తెలంగాణలో టీఆర్ఎస్కు ఎప్పటికీ పోటీ కాలేదని కేసీఆర్ భావిస్తూ వచ్చారు. కానీ వాస్తవ పరిస్థితులు అలా లేవని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి.
బీజేపీలోకి పెరుగుతున్న వలసలు
తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం వేగంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విషయం ఎలా ఉన్నా.. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ దూకుడుగా అనుసరిస్తున్న వ్యూహాలు ముఖ్యమంత్రి కేసీఆర్కు కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రజల్లో పేరున్న ఇతర పార్టీల్లోని నాయకులు ఇప్పటికే బీజేపీ కండువా కప్పుకుని టీఆర్ఎస్కు సవాల్ విసురుతుండగా, ఇప్పుడు ఏకంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా వలసలు మొదలయ్యాయి. మునుగోడు ఉప ఎన్నిక రానున్న నేపథ్యంలో తాజాగా తుర్కపల్లిలో టీఆర్ఎస్కు దాదాపు 500 మంది నాయకులు మూకుమ్మడిగా రాజీనామాలు ప్రకటించారు. వీరంతా 21న కేంద్రమంత్రి అమిత్షా సమక్షంలో బీజేపీలో చేరనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.
చౌటుప్పల్లో జరగనున్న ఈ సభలో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి బీజేపీలో చేరనున్నారు. అంతేకాదు.. ఊహించని స్థాయిలో బీజేపీలోకి చేరికలుంటాయని ఆ పార్టీ నాయకులు ధీమాగా చెపుతున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా ఇక్కడ కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి పేరు ఖరారు కానున్నట్టు వస్తున్న సమాచారంతో అసంతృప్త నేతలు బీజేపీ వైపు చూస్తుండటం అధికార పార్టీలో కలవరం కలిగిస్తోంది. ఉప ఎన్నికల్లో ఎలాగైనా రాజగోపాల్రెడ్డిని ఓడించి బీజేపీ ప్రభావం తెలంగాణలో పరిమితమేనని చాటేందుకు మరోసారి కేసీఆర్ సర్వశక్తులూ ఒడ్డేందుకు సిద్ధమవుతున్నారు.
ఇక్కడ పార్టీ నుంచి వలసలను నిలువరించేందుకు గాను స్థానిక నాయకులకు ఆర్థిక సాయం అందించడం సహా సామదానభేద దండోపాయాలన్నింటినీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉపయోగిస్తోందని బీజేపీ నాయకులు చెపుతున్నారు. ఇక ఇక్కడ సిటింగ్ స్థానాన్ని నిలుపుకోవడం కాంగ్రెస్ పార్టీకి తలకు మించిన పనిగా మారింది. ఈ నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు సెమీ ఫైనల్స్ గా మారిన పరిస్థితి కనిపిస్తోంది.
ప్రధాని మోదీపై టీఆర్ఎస్ విమర్శల దాడి
వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా మారే పరిస్థితులను అంచనా వేసుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ వ్యూహంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శల దాడిని ఉధృతం చేశారు. మోదీని విమర్శించేందుకు ఏ అవకాశాన్ని కేసీఆర్ వదులుకోవడం లేదు. తెలంగాణకు ప్రథమ శత్రువు ప్రధాని మోదీయేనని తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. ఇక ఆయన తనయుడు మంత్రి కేటీఆర్, కుమార్తె కవిత కూడా బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందుకుగాను బీజేపీ అధికంగా ఆధారపడుతున్న సామాజిక మాధ్యమాలనే వీరు కూడా వినియోగించుకుంటున్నారు. మొత్తానికి మునుగోడు ఉప ఎన్నిక ఫలితం తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పడం ఖాయమనే చెప్పాలి.