వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి టీడీపీ-జనసేన పార్టీల మధ్య పొత్తు పొడవచ్చన్న వార్తలు వైసీపీ ప్రభుత్వ వర్గాల్లో కలవరం కలిగిస్తున్నట్టుగా కనిపిస్తోంది. పార్టీ అధినేత మొదలుకుని ప్రభుత్వంలోని మంత్రులు, వైసీపీలోని చిన్నా పెద్దా నాయకులంతా ప్రతిపక్షాల్ని టార్గెట్ చేస్తూ ఇదే అంశంపై పదే పదే వ్యాఖ్యలు చేస్తుండటం దీనినే సూచిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు. కొద్ది రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక సభలో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోమని తేల్చి చెప్పిన నాటినుంచి ఆయనపై వైసీపీ మాటల దాడి ఒక్కసారిగా పెరిగింది.
పవన్ కల్యాణ్.. చంద్రబాబు దత్తపుత్రుడని విమర్శిస్తూనే దమ్ముంటే తమతో ఒంటరిగా పోరాడాలని వైసీపీ నేతల నుంచి సవాళ్లు మొదలయ్యాయి. తాజాగా రెండు రోజుల క్రితం టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వైసీపీ అప్రజాస్వామిక పాలనను అంతం చేసేందుకు త్యాగాలకు సిద్ధమంటూ ప్రకటించిన తరువాత వైసీపీ నుంచి ఈ తరహా దాడి మరింత పెరిగింది. తాజాగా వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సోమవారం మాట్లాడుతూ చంద్రబాబు స్క్రీన్ప్లే తోనే పవన్ నడుస్తున్నారని, ప్రజలను ఫూల్స్ని చేస్తున్నారని విమర్శలకు దిగారు.
వైసీపీ నేతల వ్యాఖ్యలకు కారణం ఇదేనా..?
రాజకీయాల్లో ఎవరి వ్యూహాలు వారికి ఉంటాయి. పొత్తులపై ఒక పార్టీని మరో పార్టీ ఈ స్థాయిలో విమర్శించడం ఇంతకు ముందెన్నడూ ఎవరూ చూడనిది. నిజానికి పవన్కల్యాణ్ ఇప్పటికీ బీజేపీతో పొత్తులోనే కొనసాగుతున్నారు. వారి సూచనల ప్రకారమే ఇప్పటిదాకా పని చేస్తూ వచ్చారు. అయితే ఆయన ఆశించిన మేరకు కేంద్రంలోని బీజేపీ పెద్దల నుంచి రాష్ట్ర సమస్యల పరిష్కారానికి నిర్ధిష్టమైన హామీలు లభించకపోవడం, ఏపీ ప్రజల్లో బీజేపీపై వ్యతిరేకత తగ్గకపోగా అంతకంతకూ పెరుగుతూ పోవడంతో ఆ పార్టీతో పొత్తులో ఉంటే ఆ వ్యతిరేకతను తానూ మోయక తప్పదని పవన్ కల్యాణ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. వీటన్నింటికీ మించి వైసీపీ ప్రభుత్వం లోపాయికారీగా కేంద్రంలోని బీజేపీతో అవగాహనతో పనిచేస్తోందని, ఆ పార్టీ పెద్దల ఆదేశాలకనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటోందన్న నిర్ణయానికి ఆయన వచ్చినట్టు జనసేన పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తాజాగా పవన్ వ్యాఖ్యలు కూడా దీనినే సూచిస్తున్నట్టు వారు చెపుతున్నారు.
ఇప్పటిదాకా బీజేపీ- జనసేన కలిసి కూటమిగా ఎన్నికల బరిలోకి దిగుతాయని, పార్టీ వ్యతిరేక ఓటును ఈ కూటమి భారీగా చీల్చడం ఖాయమని, తద్వారా సీట్లు తగ్గినా బొటాబొటి మెజారిటీతో నైనా తిరిగి అధికారంలోకి వచ్చేది తామేనని వైసీపీ నాయకత్వం భావించింది. కానీ పవన్ తాజా వ్యాఖ్యలను బట్టి చూస్తే.. బీజేపీ తీరు మారకపోతే ఆ పార్టీ బంధనాల నుంచి దూరం జరిగేందుకే ఆయన సిద్ధపడినట్టు స్పష్టమవుతోంది. ఈ అంశమే వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర కలకలానికి కారణంగా భావించాలి.
దీటుగా స్పందించిన జనసేనాని
వైసీపీ సింహంలా సింగిల్గానే బరిలోకి దిగుతుందని, దమ్ముంటే విపక్షాలు అదేమాదిరిగా తమను ఎదుర్కోవాలని వైసీపీ నేతల నుంచి ఎదురవుతున్న సవాళ్లపై అటు టీడీపీ, ఇటు జనసేన నాయకులు ఘాటుగా స్పందించారు. తమ పార్టీ నిర్ణయాలతో వైసీపీకి ఏం పనని, అటువంటి డైలాగులు తాను సినిమాల్లో మాత్రమే చెపుతానని, నిజ జీవితంలో వాస్తవాలను గుర్తించి నడుచుకుంటానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అధికార పార్టీ నేతలకు దీటుగా సమాధానమిచ్చారు. ఇక టీడీపీతో సంబంధం లేకుండా బీజేపీ, జనసేన మాత్రమే కలిసి పని చేస్తాయన్నట్టుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన ప్రకటనపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించిన సమయంలో పవన్కల్యాణ్ నవ్వుతూ సమాధానం దాటవేశారు. తద్వారా సోము వీర్రాజు ప్రకటనకు తానేమంత ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆయన చెప్పినట్టయింది. అంతేకాదు రాష్ట్రంలో త్వరలో అద్భుతం జరుగుతుందని తానాశిస్తున్నట్టు పవన్ కల్యాణ్ చెప్పారు. జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ఏపీ రాజకీయాల్లో రానున్న రోజుల్లో ఆసక్తికర పరిణామాలు చూడబోతున్నట్టు భావించవచ్చు.