ఆర్థిక సంక్షోభంతో అతలాకుతలమవుతున్న శ్రీలంకలో ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో తిరుగుబాటు చేయడంతో ప్రధాని పదవికి మహీంద రాజపక్స రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా ఆ దేశ నూతన ప్రధానిగా మాజీ ప్రధాని, సీనియర్ పొలిటీషియన్ రణిల్ విక్రమసింఘే బాధ్యతలు స్వీకరించారు. దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఈమేరకు నిర్ణయం తీసుకుని విక్రమసింఘేకు ప్రభుత్వ పగ్గాలు అప్పగించినట్టు తెలుస్తోంది. ప్రస్తుత సంక్షోభ పరిస్థితులను అధిగమించేందుకు, ప్రజల ఆగ్రహం చల్చార్చేందుకు అత్యవసర పరిస్థితుల్లో ఈ నిర్ణయం జరిగినట్టు సమాచారం.
73 ఏళ్ల వయసున్న విక్రమసింఘే ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారని ఆ దేశ అధ్యక్షుడి కార్యాలయం పేర్కొంది. గొటబాయ రాజపక్స కూడా ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని నిర్ధారించారు. ‘‘ కొత్త ప్రధానమంత్రి విక్రమసింఘేకు అభినందనలు. కష్టకాలంలో దేశాన్ని సవ్యమైన దిశలో నడిపిస్తారని ఆశిస్తున్నాను’’ అని ఆయన ఆకాంక్షించారు. కాగా విక్రమసింఘే శ్రీలంకకు 5వ సారి ప్రధానిగా వ్యహరించనుండటం విశేషం. శ్రీలకం పార్లమెంట్లో మొత్తం 225 సీట్లు ఉండగా గత ఎన్నికల్లో విక్రమసింఘే పార్టీ యూఎన్పీకి కేవలం ఒకే ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. ఆయన మాత్రమే ఎంపీగా కొనసాగుతున్నారు. కాగా అత్యంత కఠినమైన పరిస్థితుల్లో పాలన పగ్గాలు చేపట్టిన విక్రమసింఘే ప్రస్తుతం అక్కడ ఎదురవుతున్న సవాళ్లను ఎలా ఎదుర్కొని దేశాన్ని గట్టెక్కిస్తారో చూడాల్సి ఉంది.