డాలర్తో పోల్చితే రూపాయి విలువ గతంలో ఎన్నడూ లేని విధంగా దిగజారింది. బుధవారం భారత స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి ఒక డాలర్కు 79. 04కు రూపాయల స్థాయికి పతనమైంది. ఇది జీవన కాల కనిష్ట విలువ కావడం గమనార్హం. రష్యా..ఉక్రెయిన్పై ఆక్రమణకు దిగడంతో ప్రపంచవ్యాప్త పరిణామాల నేపథ్యంలో కొంతకాలంగా రూపాయిపై ఒత్తిడి పెరుగుతూ వస్తోంది. మంగళవారం ఒక్కరోజే 48 పైసలు క్షీణించిన రూపాయి బుధవారం మరో 19 పైసలు పతనమైంది. రూపాయి విలువ మరింత క్షీణించకుండా ఒకపక్క రిజర్వు బ్యాంక్ రెపో రేట్లు పెంచడం సహా పలు చర్యలు తీసుకున్నప్పటికీ పెద్దగా ఫలితం కనిపించడం లేదు.
ఎందుకీ పతనం..
రష్యా- ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం కారణంగా నాటో కూటమి సహా పలు పశ్చిమ దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించడంతో ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. దీంతో దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతోంది. మరోపక్క యుద్ధం విపరిణామాలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కారణంగానే రక్షణాత్మక చర్యల్లో భాగంగా యూఎస్ ఫెడరల్ బ్యాంక్ చాలాకాలం తరువాత వడ్డీ రేట్లు సవరించింది. దీంతో భారతీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత మదుపుదారులు కొద్ది రోజులుగా భారీ స్థాయిలో తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. భారత్ చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతుల ద్వారానే తీర్చుకుంటున్న నేపథ్యంలో ఇది రూపాయిపై పెను ప్రభావం చూపుతోంది.
రూపాయి విలువ తగ్గితే దిగుమతులు భారం..
కరెన్సీ విలువ క్షీణిస్తే తమపై పడే ప్రభావం ఏముంటుందని సామాన్య ప్రజలు భావిస్తారు. కానీ దీని ప్రభావం వారిపైనే ప్రత్యక్షంగా పడుతుంది. వాణిజ్య మిగులు అధికంగా ఉండే చైనా వంటి దేశాల పరిస్థితి వేరు. ఎగుమతుల కంటే దిగుమతులే అధికంగా ఉండే భారత్ వంటి దేశాలకు కరెన్సీ విలువ క్షీణత కారణంగా దిగుమతి చేసుకునే వస్తువులు భారంగా మారుతాయి. ఎందుకంటే అంతర్జాతీయ వాణిజ్యం అంతా డాలర్ల రూపంలోనే సాగుతుంది. ఈ పరిస్థితుల్లో విదేశీ మారక ద్రవ్య నిల్వలు తరిగిపోతాయి. ఇక దిగుమతి చేసుకునే వంట నూనెలు, పప్పు దినుసులూ ప్రియమవుతాయి. అధికంగా పడిన భారాన్ని ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో ప్రభుత్వం ప్రజలపైనే మోపక తప్పదు. ఇక విదేశీ ముడి సరుకుల ఆధారంగా పని చేసే పరిశ్రమలకు కూడా కరెన్సీ క్షీణత పెను భారమే.
కొన్ని ఉపయోగాలూ ఉన్నాయి..
రూపాయి క్షీణతతో నష్టాలే అధికమైనా.. కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. భారత్ ప్రస్తుతం ఐటీ, ఫార్మా రంగాల్లో ప్రధాన దేశంగా ఎదుగుతోంది. ఈ రంగాలకు ఎగుమతుల ద్వారానే అధిక ఆదాయం వస్తుంది. వీటికి డాలర్ల రూపంలోనే విదేశీ ఆదాయం లభిస్తుంది కాబట్టి ఈ రంగాల్లో ఉన్న సంస్థలకు ఇది ప్రయోజనం కలిగిస్తుంది. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ డాలర్లలో ఆర్జించేవారికి కూడా ఇది లాభం చేకూరుస్తుంది.