క్రికెట్ హిస్టరీలోనే అరుదైన ఆటగాడిగా.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సాధించిన రికార్డులను సైతం అధిగమించగల మేటి బ్యాట్స్మెన్గా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఘనత విరాట్ కోహ్లిది. అయితే అతడు గడచిన రెండుమూడేళ్లుగా కెరీర్లోనే అత్యంత గడ్డుకాలం ఎదుర్కొంటున్నాడు. గతంలో బ్యాట్ పట్టుకుని గ్రౌండ్లోకి దిగితే చాలు ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించి పరుగుల వరద పారించిన కోహ్లీ మూడంకెల స్కోరు చేసి చాలాకాలం కావస్తోంది. ఇక తాజాగా జరిగిన ఇంగ్లండ్ టూర్లో అటు టెస్టుల్లోనూ ఇటు వన్డేల్లోనూ, టీ20 మ్యాచ్ల్లోనూ అత్యంత పేలవమైన ప్రదర్శన చేయడంతో ఇప్పుడు ఏకంగా జట్టులో అతడి స్థానానికే ఎసరు వచ్చింది. ఇప్పటికే కపిల్దేవ్, సెహ్వాగ్ వంటి మాజీ క్రికెటర్లు అతడిని జట్టులో ఎందుకు ఉంచుతున్నారంటూ విమర్శలు కూడా చేశారు.
కానీ అనూహ్యంగా పలువురు విదేశీ క్రికెటర్ల నుంచి మాత్రం విరాట్కు మంచి మద్ధతు లభిస్తోంది. వీరిలో పాకిస్తాన్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం, ఆ జట్టు మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్.. కోహ్లీకి అండగా నిలుస్తూ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. ఇక ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ కూడా అతడు గొప్ప ఆటగాడని, మళ్లీ పునర్వైభవం సాధిస్తాడని తన అభిప్రాయం తెలపగా, ఆస్ట్రేలియా మూడుసార్లు ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఆ జట్టు మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కూడా తాజాగా ఈ లిస్టులో చేరిపోయాడు. కోహ్లి లాంటి ఆటగాడు ఉన్న జట్టుతో తలపడేందుకు తాను కూడా భయపడతానని, అతడిలాంటి అత్యుత్తమ బ్యాటర్కి జట్టులో స్థానం తప్పక ఉంచాలని పాంటింగ్ టీం ఇండియా సెలెక్షన్ కమిటీకి సూచించడం విశేషం. వీరందరి నమ్మకం నిలబెడుతూ కోహ్లీ మళ్ళీ జట్టులోకి వచ్చి అద్భుతాలు చేస్తాడో లేదో చూడాలి మరి.