అప్పటికే బలమైన పునాదులు ఉన్న పార్టీలకు సలహాలు, సూచనలు ఇస్తూ, గెలుపు కోసం తన ‘టక్కు-టమార’ విద్యలు ప్రదర్శించడం వేరు… స్వంతంగా పార్టీ ఏర్పాటు చేసి ప్రజలు మనసులు గెలవడం వేరు. ఈ సున్నితమైన అంశాన్ని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ విస్మరిస్తున్నట్లున్నారు. సొంతంగా పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. 2014 లో కేంద్రంలో బీజేపీ విజయంలో, 2019 ఏపీలో వైసీపీ భారీ మెజార్టీ..2020లో పశ్చిమ బెంగాల్ లో తృణమూల్.. ఇలా పీకే ‘ఎత్తులు-జిత్తులు’తో దేశ రాజకీయ వర్గాలలో పేరు తెచ్చిపెట్టాయి. అంత మాత్రాన ఏకంగా పార్టీ ఏర్పాటుకు సిద్దమైపోతే.. పరిస్థితులు అన్నివేళలా .. అన్నింట్లో అనుకులిస్తాయా? అన్న చర్చ మొదలైంది. ఇన్ని పటిష్టమైన పార్టీల మధ్య పీకే మరో పార్టీ పెట్టి ఏమి పీకుతారు.. అంటూ సోషల్ మీడియాలో అపుడే సెటైర్స్ మొదలయ్యాయి. ‘కోడి కత్తి’ లాంటి చౌక బారు ఎత్తుగడలతో పీకే పన్నిన వ్యూహం ఆంధ్రప్రదేశ్ లో జగన్ గెలుపునకు కొంత మేర ఉపయోగపడి ఉండవచ్చు. అన్ని వేళలా ఇలాంటి ఎత్తుగడలు జనాలు నమ్మే పరిస్థితి ఉండదు.
పీకే పార్టీ అంటూ పెడితే బీహార్ లో పెడతారు. అక్కడ సీఎం నితీష్ కుమార్ పట్ల ఇంకా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత లేదు. వచ్చినా , బీజేపీ ఆ స్థానాన్ని భర్తీ చేస్తుంది. మూడో ప్రత్యామ్నాయంగా లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తెరపైకి రానున్నాడు. ఈ నేపథ్యంలో పీకేకు సొంత రాష్ట్రంలో సైతం ప్లేస్ లేదు.
ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్! టార్గెట్ 2024!!.. ఇదీ భారత్ తాజా రాజకీయాల్లో హాట్ టాపిక్.
“రెండు దశాబ్దాల క్రితం సక్సెస్ ఫుల్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి అరడజనుకుపైగా సినిమాలు తీసి బిగ్ హిట్ చేయగలిగారు. ఆ ఊపు, ఉత్సాహంతో తానే హీరోగా ‘ఉగాది’ పేరుతొ ఓ సిన్మా తీసి ఘోరంగా ఫెయిల్ అయ్యారు. తర్వాత డైరెక్టర్ గా ఛాన్స్ లు కూడా మిస్సయ్యారు. ప్రశాంత్ కిషోర్ కి కూడా ఈ సూత్రం వర్తిస్తుంది. ‘తాను ఒప్పుకున్న రాజకీయ పార్టీ గెలుపు కోసం పీకే ఎంతకైనా తెగిస్తారు..’ అంటే సమాజానికి దాని వల్ల ఎంత తీవ్రమైన నష్టం వచ్చినా, శాంతి భద్రతల అంశం తలెత్తినా ప్రశాంత్ కిషోర్ కి ఏ మాత్రం పట్టదు. అంటే వ్యవస్థలు నష్టపోయినా, సమాజం వర్గాలు, మతాలుగా విడిపోయి.. కొట్టుకున్నా పికెకు చీమ కుట్టినట్లు కూడా ఉండదనేది సామాజిక, రాజకీయ విశ్లేషకుల మాట. అంటే ఇలాంటి దుష్ట పన్నాగాలు పన్నే వారు ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తే పరిస్థితులు ఇంకెంత దారుణంగా ఉంటాయో అర్ధం చేసుకోవాలి.
రాజకీయ పార్టీ అంటే మాటలా?
కొత్తగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలంటే సామాన్య విషయమేమీ కాదు. ఇది పీకే కు తెలియందేమీ కాదు. తన సొంత రాష్ట్రం బీహార్ లో రాజకీయ అరంగేట్రం చేయనున్నట్లు ప్రకటించిన ప్రశాంత్ కిషోర్ .. ఈ మేరకు ఇప్పటికే గ్రౌండ్ వర్క్ చేసుకునే ఉంటారు. అయితే దీని వెనుక పీకే కు బలమైన సపోర్ట్ ఉండే ఉంటుంది. జాతీయ పార్టీనో, లేదా.. బలమైన వ్యక్తుల సమూహమో పీకే వెనకుండి నడిపించడానికి సన్నాహాలు చేస్తున్నారన్న ప్రచారమూ వినిపిస్తుంది.
“ప్రజాస్వామ్యంలో అర్థవంతమైన భాగస్వామిని అయి, ప్రజానుకూల విధానాల రూపకల్పనలో సాయం చేయడంలో పదేళ్లు గడిచాయి. ఇప్పుడు నేరుగా ప్రజల దగ్గరకు చేరువకావాల్సిన సమయం వచ్చింది. వారి సమస్యల్ని మరింత మెరుగ్గా అర్థం చేసుకుని, జన సురాజ్కు బాటలు వేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఆరంభం బిహార్ నుంచే..” అని తాను పెట్టబోయే రాజకీయ పార్టీ గురించి ట్వీట్ చేశారు ప్రశాంత్ కిషోర్.
ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంపై పీకే మరింత స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఆయన కొత్తగా పార్టీ పెడతారా, ఏదైనా దిగ్గజ పార్టీలో చేరి తన అజెండాను ముందుకు తీసుకెళ్తారా అని చూడాల్సి ఉంది. నిజానికి.. కొన్నేళ్ల క్రితమే పీకే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. బిహార్లోని అధికార పక్షం జేడీయూ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. కానీ ఎక్కువ కాలం కొనసాగలేదు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ జేడీయూ అధిష్ఠానం ఆయన్ను 2020 జనవరిలో బహిష్కరించింది.
కాంగ్రెస్లో చేరటంపై హైడ్రామా?
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని, కాంగ్రెస్ పార్టీలో చేరతారని గత కొంత కాలంగా హాట్టాపిక్గా మారింది. 2024 లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోందని, అందుకే పీకేను పార్టీలో చేరుకుంటున్నట్లు వాదనలు వినిపించాయి. అందుకు బలం చేకూరుస్తూ.. కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనతో విస్తృత చర్చలు జరిపింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, సీనియర్ నేతలు కమల్నాథ్, దిగ్విజయ్ సింగ్, వంటి నేతలతో భేటీ అయ్యారు. గత ఏప్రిల్లో నాలుగు రోజుల్లోనే సోనియాతో మూడుసార్లు భేటీ అయ్యారు పీకే. దాంతో కాంగ్రెస్లో చేరటం ఖాయం అనుకున్నారు అంతా.
అయితే.. ప్రశాంత్ కిశోర్ను కాంగ్రెస్లో చేర్చుకోవాలంటే ఆయనకు ఓ షరతు విధించారు. పీకే కాంగ్రెస్ పార్టీలో చేరాక మరే ఇతర రాజకీయ పార్టీలకు ఆయన ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయకూడదు. అనేది ఆ షరతు. దీంతో కాంగ్రెస్-పీకే ల బేరం బెడిసికొట్టింది. దీంతో తానే స్వయంగా పార్టీ పెట్టడానికి సిద్దమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయ్. దీనిపై ఆయనే క్లారిటీ ఇవ్వాలి.