వైసీపీ ప్రభుత్వంలో రెబల్ నాయకుడిగా ఉన్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సొంత నియోజకవర్గం నరసాపురం వచ్చి రెండేళ్లకు పైగానే అవుతోంది. దీనికి కారణాలు అందరికీ తెలిసినవే. ఇప్పుడాయన తన రక్షణకోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించి, కోర్టు ఆదేశాలతో నియోజకవర్గంలో జరిగే ఓ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. స్వాతంత్ర సమరయోధుడు, దేశాన్ని బానిస సంకెళ్ల నుంచి విముక్తి కల్పించేందుకు గిరిజనులతో కలిసి సాయుధ పోరాటం చేసి అసువులు బాసిన అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని ఘనంగా నిర్వహిస్తూ ఆయన స్మృతిగా భారీ విగ్రహాన్ని భీమవరంలో ఆవిష్కరించబోతున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేశ ప్రధాని నరేంద్రమోదీ రానుండటంతో ప్రొటోకాల్ ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి, స్థానిక ఎంపీ కూడా దీనికి హాజరు కావాల్సి ఉంది. అయితే గతంలో ఏపీ సీఐడీ ఎంపీ రఘురామరాజుపై పలు కేసులు మోపి ఆయనను అరెస్టు చేసి భౌతిక హింసకు గురిచేసిందంటూ ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే పొందిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఆయనపై ఇక్కడ పలు కేసులు పెండింగ్లో ఉన్నాయి. అప్పటినుంచి ఆయన తనకు రాష్ట్రంలో రక్షణ లేదని చెపుతూ నియోజకవర్గానికి రావడంలేదు. దేశ రాజధాని ఢిల్లీలోనే అత్యధిక సమయం ఉంటూ అప్పుడప్పుడూ హైదరాబాద్లోని తన నివాసానికి మాత్రమే వచ్చి వెళుతున్నారు.
రఘురామరాజు ఇప్పటికీ రచ్చబండ పేరుతో మీడియాతో తరచుగా మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఆయనను ఏపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వబోమని వైసీపీ నాయకులు మాటల యుద్ధం చేస్తున్నారు. అయితే బ్రిటిష్ ముష్కరుల దమన నీతికి వ్యతిరేకంగా పోరాడిన విప్లవజ్యోతి అల్లూరి విగ్రహావిష్కరణకు తాను తప్పక హాజరు కావాల్సి ఉందని, తనకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా, రక్షణ కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని రఘురామరాజు హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఆయనకు అనుకూలంగా ఆదేశాలు జారీ చేయడంతో ఎంపీ రాకకు మార్గం సుగమమైంది.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కొద్ది కాలానికే ఆయనకూ సొంత పార్టీ ప్రభుత్వానికి మధ్య పరోక్షంగా మొదలైన యుద్ధం ఆ తర్వాత ప్రత్యక్షంగానే కొనసాగుతోంది. ఆయన రాక సందర్భంగా ఏవిధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. భీమవరం పర్యటనలో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూడాలని ఏపీ చీఫ్ సెక్రటరీని, జిల్లా ఎస్పీని కోర్టు ఆదేశించింది. ధర్మాసనం ఎదుట పిటిషనర్ తరఫున న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. ఇక ఎంపీ రఘురామ చాలాకాలం తరువాత తన సొంత ప్రాంతమైన భీమవరం రానున్న నేపథ్యంలో ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రధాని, ముఖ్యమంత్రితో పాటు ఈ కార్యక్రమంలో రఘురామరాజు వేదికను పంచుకోబోతుండటం అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తోంది.