రెండున్నరేళ్లుగా ప్రపంచ మానవాళిని వణికిస్తున్న కోవిడ్ మహమ్మారి ఇంకా అంతం కాలేదు. పలు వేరియంట్ల రూపంలో చాలా దేశాల్లో ఇప్పటికీ భయపెడుతూనే ఉన్న విషయం తెలిసిందే. దీనికి తోడు మంకీ ఫాక్స్ వ్యాధి కూడా ఇప్పటికే 60కి పైగా దేశాల్లో వ్యాపించడం కలవరం కలిగిస్తోంది. కాగా ఇప్పుడు ఆఫ్రికాలోని ఘనా దేశంలో మరో ప్రాణాంతక వైరస్ వెలుగు చూడటం ఆందోళనకర పరిణామమని చెప్పాలి. మార్బర్గ్గా చెపుతున్న ఈ వైరస్ అత్యంత ప్రమాదకరమైనదిగా చెపుతున్నారు. రెండు వారాల క్రితమే ఇద్దరు వ్యక్తుల్లో తొలిసారి ఈ వైరస్ లక్షణాలు కనిపించగా వారిద్దరూ ప్రాణాలు కోల్పోవడం ఈ వైరస్ మనుషులకు ఎంత హానికలిగించనుందో సూచిస్తోంది. డయేరియా, జ్వరం, వాంతుల వంటి లక్షణాలతో ఈ వైరస్ బాధితులు చనిపోయిన విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ధ్రువీకరించింది. అంతేకాదు.. వీరితో సన్నిహితంగా ఉన్న మరో 34 మందిని కూడా గుర్తించి వారిని క్వారంటైన్లో ఉంచి వారి ఆరోగ్యంపై పర్యవేక్షిస్తున్నట్టు తెలిపింది.
వైరస్ బారినపడిన వ్యక్తుల నుంచి నమూనాలను సేకరించామని, పూర్తిస్థాయిలో పరిశీలించి నిర్థారించేందుకు సెనెగల్లోని పాశ్చర్ పరిశోధనా సంస్థకు పంపించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు తెలిపారు. వైరస్ వెలుగు చూసిన ప్రాంతంలో మరింతమందికి ఇది వ్యాపించే ప్రమాదం ఉండటంతో అక్కడ పూర్తిస్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ప్రపంచ ఆరోగ్య సంస్థ తరపున వైద్య నిపుణులను కూడా ఘనాకు పంపిస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
ఎబోలా కుటుంబానికి చెందిన మార్బర్గ్ వైరస్ గబ్బిలాల నుంచి మానవులకు సంక్రమించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ వైరస్ సోకినవారిలో మరణాల రేటు 88 శాతం వరకూ ఉండే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెపుతున్నారు. ఈ వైరస్నివారణకు ఇప్పటిదాకా ఎలాంటి వ్యాక్సిన్లు లేవని వారు చెపుతున్నారు. అయితే లక్షణాలను చికిత్స చేయడం, బాధితులకు అధికంగా ద్రవాలను అందించడం ద్వారా ప్రాణాపాయం నుంచి కాపాడే అవకాశం ఉందని అంటున్నారు.