కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి మధ్య వాడిగా వేడిగా జరుగుతున్న మాటల యుద్దం మరింత హీటెక్కుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కొంతకాలం క్రితం దాకా బీజేపీ స్థానిక నాయకత్వంపైనే ఎక్కువగా మాటల దాడికి పరిమితమైన టీఆర్ఎస్ నాయకత్వం ఇక పూర్తి ఎన్నికల మూడ్లోకి వచ్చేసినట్టు కనిపిస్తోంది. అందుకే బీజేపీ కేంద్ర నాయకత్వంపైనే ప్రత్యక్షంగా విమర్శలు గుప్పిస్తోంది. గతంలో మూడో ఫ్రంట్ అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హడావుడి చేసినా అది బీజేపీకి ప్రయోజనం కలిగించే రాజకీయ వ్యూహంలో భాగమేనని చాలామంది భావించారు.
అయితే ఇప్పుడు పరిస్థితి వేరని చెప్పాలి. బీజేపీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా చేస్తున్న ప్రయత్నాలతో కేసీఆర్ అటు కాంగ్రెస్ను, ఇటు బీజేపీని సమానమైన ప్రత్యర్థులుగానే భావిస్తున్నారు. సీఎం కేసీఆర్ వేసంగి ధాన్యం కొనుగోలు అంశంపై ఢిల్లీ స్థాయిలో రాజకీయం చేసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజల దృష్టిలో దోషిగా నిలిపేందుకు ప్రయత్నం చేశారు. అంతేకాదు ఏకంగా టీఆర్ఎస్ పార్టీని జాతీయ స్థాయికి విస్తరించే అవకాశమున్నట్టు కూడా ప్రకటించారు. ఇక కేంద్రంలోని పెద్దలపైనా విమర్శలు గుప్పించారు.
తాజాగా కేసీఆర్ తనయుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్ డైరెక్ట్గా ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం ద్వారా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ మరింత పెంచారు. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాలన అధ్వానమని, దేశంలో బొగ్గు కొరత, కోవిడ్ సమయంలో ఆక్సిజన్ కొరత, పరిశ్రమలకు కరెంట్ కొరత, యువతకు ఉద్యోగాల కొరత, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కొరత, రాష్ట్రాలకిచ్చే నిధుల కొరత పరిస్థితులను చూస్తున్నామన్నారు. ఈ సమస్యలన్నింటికీ మూలకారణం ప్రధాని నరేంద్రమోదీ విజన్ కొరత ఉండటమేనని కేటీఆర్ సూత్రీకరించారు. ఇప్పుడు బీజేపీ నుంచి దీనికి ఘాటైన ప్రతిస్పందన రావడం ఖాయమేనని చెప్పాలి.