ఇప్పటిదాకా రాజకీయ వర్గాల్లో కాస్త సస్పెన్స్ సృష్టించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తన అడుగులు ఎటువైపో తేల్చేశారు. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికీ మంగళవారం రాజీనామా చేశారు. కొంతకాలంగా ఆయన బీజేపీలో చేరతారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఎమ్మెల్యే పదవినీ ఆయన వీడటం ద్వారా అదే స్థానంలో బీజేపీ నుంచి పోటీ చేసి గెలిచి సత్తా చాటాలని, ముఖ్యమంత్రి కేసీఆర్కు షాక్ ఇవ్వాలని భావిస్తున్నారు.
వచ్చే ఏడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణవ్యాప్తంగా ఇతర పార్టీల్లో ఉన్న బలమైన నేతలను పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ వ్యూహ రచన చేసింది. ఇందులో భాగంగానే ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజకీయంగా బలమైన కోమటిరెడ్డి కుటుంబాన్ని బీజేపీలో చేర్చుకుని, మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచి పార్టీ శ్రేణుల్లో మరింత జోష్ నింపేందుకు ప్రయత్నం చేయనుందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
కాగా మునుగోడు ప్రజలకు మేలు జరుగుతుందనే తాను రాజీనామా చేస్తున్నట్టు రాజగోపాల్రెడ్డి చెప్పారు.
ఉప ఎన్నిక జరిగితేనే నిధులు వస్తాయని అంటున్నారని, సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం ఏమాత్రం సహకరించడం లేదన్నారు. గతంలో దళితుడిని సీఎం చేస్తానని ప్రజలకు వాగ్దానం చేసిన కేసీఆర్ మాట తప్పారని రాజగోపాల్రెడ్డి అన్నారు. ఇక కేసీఆర్ను గద్దె దించడమే లక్ష్యమని, ఆ సత్తా బీజేపీకే ఉందని గతంలోనే రాజగోపాల్రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. మునుగోడు స్థానానికి ఉప ఎన్నిక వస్తే కేసీఆర్ ప్రభుత్వానికి గట్టి సవాల్ ఎదురవడం ఖాయం. హుజూరాబాద్ ఉప ఎన్నిక మాదిరిగానే మరో చేదు ఫలితం టీఆర్ఎస్ చవిచూడాల్సి రావచ్చన్న అంచనాలున్నాయి.