ఇంగ్లండ్ తో మూడో వన్డే మ్యాచ్లో భారత్ ఆల్రౌండ్ ప్రదర్శనతో సత్తాచాటింది. 5 వికెట్లు కోల్పోయి 42 ఓవర్లలో నే విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జట్టును 259 పరుగులకు ఆలౌట్ చేసింది. ఆ తరువాత విజయానికి అవసరమైన 260 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్ ఒక దశలో 72 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్టు కనిపించింది. విరాట్ కోహ్లి మరోసారి విఫలం కాగా రోహిత్ శర్మ కూడా తక్కువ పరుగులకే పెవిలియన్ కు చేరాడు. కీలక సమయంలో హార్ధిక్ పాండ్యా, రిషభ్ పంత్ ఇంగ్లండ్ బౌలింగ్ను సమర్థంగా ఎదుర్కొని 115 బంతుల్లోనే 133 పరుగుల భాగస్వామ్యంతో మ్యాచ్ను ఇంగ్లండ్ చేతుల్లోంచి లాగేసుకున్నారు.
71 పరుగులు చేసిన పాండ్యా జట్టు స్కోరు 205 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆ తరువాత రిషభ్ పంత్.. జడేజాతో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. రిషభ్ 113 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్లతో 125 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇంగ్లండ్ పర్యటనలో టెస్టు సిరీస్ను డ్రా చేసుకున్న భారత్ , టీ20 సిరీస్ను, వన్డే సిరీస్నూ కైవసం చేసుకుంది.