రెండేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ చైనా, ఉత్తర కొరియా, అమెరికా, పలు యూరోప్ దేశాల్లో ఇప్పటికీ ఉనికిని చాటుకుంటున్న విషయం తెలిసిందే. అయితే గడచిన కొన్ని నెలలుగా భారత్లో ఈ మహమ్మారి అదుపులోనే ఉంది. మనదేశంలో అత్యధిక శాతం ప్రజలకు వ్యాక్సినేషన్ జరగడం ఇందుకు కారణంగా చెప్పుకోవాలి. అయితే దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది.
అక్కడ ప్రస్తుతం రోజుకు 2 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. అంతేకాదు.. సగటున రోజుకు 8 నుంచి 10 మంది వరకు చనిపోతున్నట్టు వెల్లడవుతున్న గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పాజిటివిటీ రేటు కూడా పెరుగుతోందని వైద్య రంగ నిపుణులు చెపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు నిర్లక్ష్యంగా ఉంటే ప్రమాదమేనని, జనం రద్దీగా ఉన్న చోట్ల ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని వారు సూచిస్తున్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్కుమార్ సక్సేనా కూడా ఇదే అంశంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ట్వీట్ చేశారు. ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే అక్కడ మాస్క్లు ధరించడం తప్పనిసరి చేసింది.