చెన్నైలోఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ కార్యాలయంలోకి పట్టపగలే ఏడుగురు దుండగులు చొరబడి ఏకంగా రూ.30లక్షలు దోచుకెళ్లారు. పారిపోతున్న దొంగలను పట్టుకునేందుకు ఆ సంస్థ యజమాని, ఉద్యోగులు చేసిన ప్రయత్నం.. సినిమాను తలపించింది. చివరకు ఛేజింగ్ జరుగుతుండగా బైక్కు ప్రమాదం జరిగి ఒక దుండగుడు పట్టుబడ్డాడు. మిగిలిన వారు పారిపోయారు.
కత్తులతో బీభత్సం సృష్టిస్తూ.. తమిళనాడులోని కిల్పక్కానికి చెందిన కరుణానిధి, కరూర్ జిల్లాకు చెందిన వెంకటేశన్, శరవణన్ కలిసి ఓజోన్ కేపిటల్ పేరిట ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ నడుపుతున్నారు. చెన్నై వడపళనిలో ఆ సంస్థ కార్యాలయంలోకి మంగళవారం సాయంత్రం 3 గంటల ప్రాంతంలో ఏడుగురు వ్యక్తులు చొరబడ్డారు. లోపల ఉన్న వారందరినీ కత్తులతో బెదిరించారు. లాకర్లో ఉన్న రూ.30లక్షలు లాక్కున్నారు. ఏం జరుగుతుందో ఆలస్యంగా తెలుసుకున్న యజమాని శరవణన్.. దుండగులు లోపల ఉండగానే ఆఫీసుకు తాళం వేశాడు. పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
లోపలున్న దొంగలు తలుపులు పగలకొట్టి పారిపోయే ప్రయత్నం చేశారు. అడ్డుకున్న నవీన్ అనే ఉద్యోగిని చితకబాది, ఆఫీస్ నుంచి బయటపడ్డారు. అప్పటికే సిద్ధంగా ఉన్న వాహనాల్లో పారిపోయారు. అయితే.. శరవణన్, ఇతర ఉద్యోగులు దుండగుల్ని కారులో వెంబడించారు. ఈ క్రమంలో తిరునగర్లో ఇద్దరు దుండగులు ప్రయాణిస్తున్న బైక్ ప్రమాదానికి గురైంది. అయినా ఒకడు అదే వాహనంపై పారిపోగా.. మరొకడిని శరవణన్ బృందం పట్టుకుని పోలీసులకు అప్పగించింది.