టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ఇప్పటిదాకా పాన్ ఇండియా స్థాయి చిత్రాల్లో నటించకపోయినా ఆయనకు దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంది. దూకుడు సినిమాలో హీరో మహేష్ గురించి వర్ణిస్తూ విలన్కి అతడి అనుచరుడు హాలీవుడ్ హీరోలా ఉన్నాడని చెపుతాడు. అది సినిమా డైలాగే అయినా మహేష్ నిజంగా అలాగే ఉంటారన్న విషయం తెలిసిందే. ఇక తన సినిమాలకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసుకున్నాక కుటుంబంతో కలిసి విదేశాలకు ట్రిప్పు వేసి సేద తీరడం మహేష్ చాలాకాలంగా పాటిస్తున్న ఆనవాయితీ. ఇప్పుడు కూడా అలాగే విదేశీ టూర్లో ఉన్న మహేష్, ఆయన భార్య నమ్రత రెండు రోజుల క్రితం న్యూయార్క్లో ప్రపంచ ప్రఖ్యాత సాఫ్ట్వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ను కలిసిన విషయం తెలిసిందే.
ఇదే అంశాన్నితన సోషల్ మీడియాలో అకౌంట్స్లో ప్రస్తావించిన మహేష్ .. బిల్గేట్స్ను కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, ఆయన ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గొప్ప వ్యక్తి అని, ప్రపంచవ్యాప్తంగా ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. దీనిపై స్పందించిన బిల్గేట్స్ తనకూ మహేష్ దంపతులను కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, న్యూయార్క్లో ఎప్పుడూ ఆనందంగా, సరదాగా గడపవచ్చని, మీకు ఎప్పుడు ఎవరు ఎదురవుతారో ఎప్పటికీ తెలుసుకోలేరని సరదాగా సమాధానం ఇచ్చారు. ట్విటర్ వేదికగా సాగిన వీరి సంభాషణ ఇప్పుడు వైరల్ అవుతోంది. గేట్స్ ఫౌండేషన్ను నెలకొల్పి తన సంపదలో పెద్ద మొత్తాన్ని దానికి కేటాయించి ప్రపంచవ్యాప్తంగా పలు సేవాకార్యక్రమాలను బిల్గేట్స్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక మహేష్ కూడా తన సంపాదనలో కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది పిల్లలకు వైద్య సహాయం అందించి వారి ప్రాణాలను ఆయన నిలబెట్టారు. వీరిద్దరి కలయిక యాదృచ్చికమే అయినా అందరికీ ఆసక్తిని కలిగిస్తోంది.