.. 20 అడుగుల పొడవు.. 42 కేజీల బరువు.. ఇది ఒక పెన్ను గురించి. ఏంటీ ఇంత భారీ బాహుబలి పెన్ను ఎక్కడ? తయారు చేశారనుకుంటున్నారా? ..
హిమాచల్ ప్రదేశ్ సిర్మౌర్ జిల్లాకు చెందిన సంజీవ్ అట్రీ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పెన్నును తయారు చేశారు. 20 అడుగుల పొడవుతో 42 కిలోల బరువు గల ఈ పెన్నులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. దీంట్లో సౌండ్ రికార్డర్తో పాటు సీసీటీవీ కెమెరాను కూడా పెట్టారు. ఈ పెన్ను షో పీస్లా కాకుండా.. ఇంక్తో ఉందని చెప్పారు. చక్కగా రాస్తుందని వెల్లడించారు. శనివారం ప్రారంభించిన ఈ పెన్నును అట్రీ పాఠశాలలోని విద్యార్థులందరికీ అంకితం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ పెన్నులో సౌండ్ సెన్సార్ ఉన్నందువల్ల.. ఉపాధ్యాయులు సెలవులో ఉన్నా పాఠాన్ని రికార్డు చేసి మొబైల్ నుంచి పంపితే ఈ పెన్ను బోధిస్తుందని వెల్లడించారు. ఈ పెన్నులో ఉన్న సీసీ కెమెరా వల్ల పాఠశాల సెక్యూరిటీకి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. పాఠశాలలో ప్రార్థనను పాడుతుందని.. సౌరశక్తితో చార్జ్ చేసుకునే సదుపాయం ఉందని వివరించారు. ఈ పెన్నును చెక్క, ఇనుముతో తయారు చేశానని.. దీనికి రూ. 45,000 ఖర్చు అయ్యిందని చెప్పారు. ఈ పెన్ను తయారీలో మరో ఆరుగురు ఉపాధ్యాయులు సహకారం అందించారని తెలిపారు. అంతకుముందు అతిపెద్ద పెన్ను రికార్డు హైదరాబాద్కు చెందిన ఆచార్య ముకునూరి శ్రీనివాస పేరిట ఉందని చెప్పారు. 18 అడుగుల పొడవు, 37 కిలోల బరువు గల ఆ పెన్ను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుందని తెలిపారు.