బీబీసీ డాక్యుమెంటరీపై మోదీ సర్కారు కన్నెర్ర చేసింది. అత్యవసర అధికారాలను ఉపయోగించుకొని ఆ వీడియోలు ప్రసారం కాకుండా కేంద్రం బ్లాక్ చేసింది. బీబీసీ డాక్యుమెంటరీకి సంబంధించిన యూట్యూబ్ వీడియోలు, ట్విట్టర్ పోస్టులను బ్లాక్ చేయిస్తున్నది. ఆ వీడియో ప్రసారం కాకుండా చానళ్లు, సోషల్ మీడియా సైట్లకు ఆదేశాలు కూడా జారీ చేసినట్టు సంబంధిత వర్గాల విశ్వసనీయ సమాచారం.
ప్రధాని నరేంద్ర మోదీపై బ్రిటన్కు చెందిన బీబీసీ చానల్ ప్రసారం చేసిన ‘ఇండియా: ద మోదీ క్వశ్చన్’ డాక్యుమెంటరీ రెండు ఎపిసోడ్లుగా బ్రిటన్లో మాత్రమే ప్రసారం అవుతున్నది. అయితే, ఈ డాక్యుమెంటరీ మొదటి ఎపిసోడ్ భారత్లో ప్రసారం కాకుండా కేంద్రం చర్యలు ప్రారంభించింది. గుజరాత్లో జరిగిన గోద్రా అల్లర్లు, ఆ సమయంలో సీఎంగా ఉన్న మోదీ వైఖరి, దానిని రాజకీయాలకు ఎలా వినియోగించుకున్నది? తదితర అంశాలను ఈ డాక్యుమెంటరీలో ప్రస్తావించారు.
ఇప్పటికే ఈ ఎపిసోడ్ను ప్రసారం చేసిన, దానిపై విశ్లేషణ చేసిన పలు యూట్యూబ్ చానళ్లలోని వీడియోలను బ్లాక్ చేయాలని కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఈ అంశంపై చేసిన 50కు పైగా ట్వీట్లకు సంబంధించిన లింక్లను సైతం నిలిపివేయాలని ట్విటర్ను ఆదేశించింది. ఐటీ నిబంధనలు 2021 ప్రకారం అత్యవసర అధికారాలు వినియోగించి ఈ ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ఇది భారత్కు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంగా వ్యాఖ్యానించిన ఆ శాఖ.. డాక్యుమెంటరీ ఎపిసోడ్ను ప్రసారం చేయవద్దంటూ యూట్యూబ్ను ఆదేశించినట్టు విదేశాంగ ప్రతినిధి అరవింద్ బాగ్చి తెలిపారు.
పూర్తి పరిశోధన చేశాం: బీబీసీ
ప్రధాని మోదీపై రూపొందించిన డాక్యుమెంటరీని బీబీసీ సమర్థించుకోవడం విశేషం. ఆయా అంశాలపై విస్తృతంగా పరిశోధించాకే దాన్ని ప్రసారం చేసినట్టు పేర్కొన్నది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పలు ముఖ్య విషయాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడానికి తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. దానిలో భాగంగానే ఈ సిరీస్లో భారత్లో హిందువులు, ముస్లింలకు మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, వాటిని ప్రధాని మోదీ రాజకీయాలకు ఎలా వినియోగిస్తున్నారనే అంశాలను ఇందులో ప్రస్తావించినట్టు తెలిపింది.