ఇటీవలికాలంలో దేశంలో పలు పురాతన నిర్మాణాలపై వివాదాలు చెలరేగుతున్న నేపథ్యంలో వీటిపై వివిధ రాజకీయ పార్టీలు తమదైన శైలిలో స్పందిస్తూ రాజకీయ ప్రయోజనాలను ఒడిసిపట్టేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఇప్పటికే పలువురు బీజేపీ నాయకులు మాట్లాడుతూ గతంలో హిందూ దేవాలయాలను కూల్చి వాటిపై మసీదులను, ఇతర కట్టడాలను నిర్మించారని వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవాల్సిందేనని వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే.
కాగా ఈ అంశంపై హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజ్మహల్ సమాధి కాదని, తేజోమహాలయమని, దానిలో మూసి ఉన్న కొన్నిగదులను తెరిస్తే నిజం బయటపడుతుందని వస్తున్న వాదనలను ప్రస్తావిస్తూ.. తాజ్మహాల్ కింద మోదీ డిగ్రీ కోసం బీజేపీ నేతలు వెతుకుతున్నట్టున్నారని ఒవైసీ వ్యంగ్యంతో కూడిన విమర్శలు చేశారు. అంతేకాదు.. మొఘలుల మాదిరిగానే, అంతకుముందు.. తరువాత ఈ దేశానికి చాలా మంది వచ్చారని, నిజానికి ఈ దేశం తనది కాదని, అలాగే థాకరే, మోదీ, అమిత్షాలది కూడా కాదని, ఎవరిదంటే ద్రవిడులు, ఆదివాసీలదని చెప్పాల్సి ఉంటుందని ఓవైసీ అన్నారు. ఆఫ్రికా, ఇరాన్, మధ్య ఆసియా, తూర్పు ఆసియా నుంచి వచ్చిన వలసల అనంతరం ఈ దేశం అనేది ఏర్పడిందని ఒవైసీ అన్నారు. ఒవైసీ వ్యాఖ్యలపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.