తెలంగాణ ఎవరి జాగీరు కాదని, రాష్ట్రంపై అందరికీ హక్కు ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విమర్శలతో విరుచుకుపడ్డారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో శనివారం జరిగిన బీజేపీ బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర పదవుల కోసం కాదని, ప్రజలందరి సంక్షేమం కోసం చేసిన యాత్ర అని, కేసీఆర్ నిరంకుశ పాలనను అంతం చేసేందుకు చేసిన యాత్ర అని గుర్తుంచుకోవాలన్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాకుండా.. సీఎం కేసీఆర్ నిజాం మాదిరిగా సొంత రాజ్యాంగం అమలు చేయాలని ప్రయత్నిస్తున్నారని షా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ను గద్దె దించేందుకు తాను అవసరం లేదని, బండి సంజయ్ ఒక్కడు చాలని అన్నారు.
సీఎం కాకముందు.. తెలంగాణకు నీళ్లు, నిధులు, నియామకాలు అందించడమే లక్ష్యమని ప్రకటించిన కేసీఆర్ ఆ తరువాత వాటిని మరచిపోయారన్నారు. తాము అధికారం లోకి వస్తే వాటిని అమలు చేసి చూపిస్తామని షా ప్రకటించారు. దళితులకు మూడెకరాల భూమిని ఇస్తామన్న హామీని కేసీఆర్ ఎందుకు అమలు చేయలేదని కేంద్ర హోం మంత్రి ప్రశ్నించారు. హైదరాబాద్లో కొత్తగా 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కట్టిస్తామని కేసీఆర్ అంటున్నారని, అయితే గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో చూడాలని అమిత్ షా ప్రజలను కోరారు. కేసీఆర్ కు మజ్లిస్ అంటే భయమని, ఆ పార్టీతో కలిసి పనిచేస్తున్నారన్నారు. టీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఒవైసీ చేతిలో ఉందని, ఆ రెండు పార్టీలను కలిపి ఓడించాలని షా తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు.