ఏళ్ల తరబడి ఆ ఆలయంలో భూమి నుంచి అగ్ని కీలలు ఎగిసి పడుతూనే ఉన్నాయి. ఇంకా పూర్తీ స్థాయి పరిశోధనలు జరగక దాని చుట్టూ.. అనేక రకాల అద్భుతాలు తిరుగుతున్నాయి.
గుజరాత్ జునాగఢ్ జిల్లాలోని జగతియా గ్రామంలో భూమిలో నుంచి అగ్నిజ్వాలలు ఎగసిపడుతున్నాయి. భూగర్భంలో నుంచి గ్యాస్పైప్లైన్ వేశారా? అని అనిపించేలా నిరంతరం మంటలు రగులుతూనే ఉన్నాయి. గ్రామంలోని మాతా హర్సిద్ధి మందిరంలో ఈ అఖండ జ్యోతి ఉండటం వల్ల.. వీటిని ప్రజలు భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నారు. పరిశోధనల్లో ఏ విషయం తేలకపోవడం వల్ల.. మంటల చుట్టూ ఆధ్యాత్మికత అల్లుకుంది. సమీపంలోని భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని, అఖండ జ్యోతిని కొలుస్తున్నారు.
ఆలయంలో మొత్తం మూడు అఖండ జ్యోతులు వెలుగుతున్నాయి. రెండు జ్యోతులు ప్రత్యేకంగా ఓ గదిలో ఉండగా.. ఒకటి గుడి ఆవరణలో ఉంది. భక్తులు ఆహారం వండుకోవడానికి, ఏవైనా ప్రయోగాలు చేయడానికి బయటి జ్యోతిని వినియోగిస్తున్నారు. లోపల ఉన్న రెండు అఖండ జ్యోతులు.. ఎలాంటి అంతరాయం లేకుండా వెలుగుతున్నాయి. ఈ మంటలు ఎప్పుడు ప్రారంభమయ్యాయనే విషయంపై స్పష్టత లేదు. చాలా ఏళ్ల నుంచి ఇవి వెలుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. మంటల్లో చెయ్యి పెట్టినా ఏమీ కాదని, భూమిలో నుంచి వచ్చే గ్యాస్కు ఎలాంటి వాసన ఉండదని తెలిపారు. ఆలయం పరిధిలోనే జ్వాల రగులుతుందని.. పరిసరాలు దాటాక ఎక్కడ ప్రయత్నించినా మంటలు రావడం లేదని చెప్పారు. దేవుడి ఆశీర్వాదం వల్లే ఇలా జరుగుతోందని చెప్పుకుంటున్నారు.
హిమాలయాల్లో ఉండే జ్యోతి ఆధారంగా ఈ జ్వాల వెలుగుతోందని చాలా మంది సాధువులు చెబుతున్నారు. హిమాలయ జ్యోతి అంశ దీనికి ఉందని అంటున్నారు. ఆలయంలో ఎక్కడైనా రెండు అడుగులు తవ్వి అగ్గిపుల్ల వెలిగిస్తే మంట వస్తుంది. ఆలయం వెలుపల ఎక్కడా మంట రాదు. అందుకే దీన్ని భక్తిశ్రద్ధలతో కొలుస్తున్నాం. ఈ మంటపై వండిన ఆహారం తింటే రోగాలు నయమవుతాయి. అవయవాలు విఫలమైనా, శారీరక సమస్యలు ఏవైనా ఈ ఆహారంతో పూర్తిగా సమసిపోతాయి. మహర్సిద్ధి, అన్నపూర్ణ దేవి ఆశీస్సులతోనే ఇది వెలుగుతోందని పూర్వీకులు చెబుతున్నారు.”