చిన్నపిల్లలకు ఇంట్లో గంటలకొద్దీ స్మార్ట్ ఫోన్లు ఇవ్వటం, టీవీలు, ల్యాప్టాప్లు చూడనివ్వటం వల్ల తీవ్ర దుష్పరిణామాలు కలుగుతాయని తాజా అధ్యయనంలో తేలింది. కోవిడ్ తర్వాత ఇది మరింత పెరగడంతో భావి భారత పౌరులకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉంది. ఎలక్ట్రానిక్ డివైస్లను అధికంగా వాడటం వల్ల పిల్లల కండ్లు దెబ్బతినటమే కాకుండా మానసికంగానూ వారిలో చెడు ప్రభావాలు పెరుగుతాయని అలహాబాద్ వర్సిటీకి చెందిన పరిశోధక విద్యార్థి మాధ్వి త్రిపాఠి నిర్వహించిన అధ్యయనంలో తేలింది. పిల్లల స్క్రీన్ టైమ్ను రెండు గంటల కంటే తక్కువకు పరిమితం చేయాలని సూచించారు. ప్రయాగ్రాజ్ మున్సిపాలిటీలోని 400 మంది పిల్లలపై ఈ అధ్యయనం నిర్వహించారు. పిల్లలు ఎక్కువ సమయం స్మార్ట్ఫోన్, టీవీ చూడటం వారి శారీరక, మానసిక సామర్థ్యాలను ప్రభావితం చేస్తున్నట్టు అధ్యయనంలో తేలింది.