కోవిడ్ మహమ్మారి దేశంలో మళ్లీ కోరలు చాస్తోందా..? కొన్ని రోజులుగా పలు రాష్ట్రాల్లో గణనీయంగా నమోదవుతున్న కొత్త కేసులను చూసి సామాన్య ప్రజల్లో నెలకొన్న భయాందోళన ఇది. ఆదివారం ఒక్క రోజునే దేశంలో 8 వేలకు పైగా కొత్త కేసులు గుర్తించగా, 10 మంది కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. పాజిటివిటీ రేటు 3.24 శాతంగా నమోదు కావడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. గడచిన కొన్ని నెలల్లో కేసుల పరంగాను, మరణాల సంఖ్యలోనూ ఇవే అత్యధికం కావడం గమనార్హం. ఒక్కవారంలోనే కొత్తగా కేసులు 50 వేలకు పైగా పెరగడంపై వైద్య నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కోవిడ్ వేరియంట్ల ఉధృతి కారణంగా ఇటీవల చైనాలో కొన్ని నగరాలు వారాల తరబడి లాక్డౌన్లో ఉండిపోయిన విషయం తెలిసిందే. చైనా ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యల కారణంగా అక్కడ పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. అదే సమయంలో ఉత్తర కొరియాలో వైరస్ ఉధృతంగా వ్యాపిస్తున్నట్టు వస్తున్న వార్తలు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. అసలు వ్యాక్సినేషనే జరగని ఉత్తర కొరియాలో కోవిడ్ కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది.
కాగా ఇప్పుడు భారత్లో కేసుల సంఖ్య పెరుగుతుండటం నాలుగో వేవ్గా భావించాలా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కాన్పూర్ ఐఐటి పరిశోధకులు జూన్ నెలలో కరోనా ఫోర్త్ వేవ్ మొదలయ్యే అవకాశం ఉందని చెప్పిన విషయం ఇప్పుడు మరోసారి చర్చకు వస్తోంది. జూన్ 22 నుంచి అక్టోబర్ 24 వరకు కోవిడ్ నాలుగో వేవ్ ప్రభావం ఉంటుందని గతంలో వారు అంచనా వేశారు. వీరు చెప్పినదాని ప్రకారం ఆగస్టు చివరి నాటికి కేసుల ఉధృతి గరిష్ట స్థాయికి చేరి ఆ తర్వాత తగ్గుముఖం పడుతుంది. అయితే దీని తీవ్రత కొత్త వేరియంట్లు పుట్టుకురావడం పైన, వ్యాక్సినేషన్, బూస్టర్ డోసులు వేయడాన్ని బట్టి ఉంటుందని కూడా వారు తెలిపారు. గత మూడు వేవ్ల సమయంలోనూ వీరి అంచనాలు చాలావరకు నిజం కావడంతో ప్రస్తుతం కోవిడ్ ఉధృతిని తేలిగ్గా తీసుకోవడం మంచిదికాదని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
అయితే కేసుల్లో అత్యధికం ప్రధానంగా మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ నుంచే ఉండటం గమనార్హం. మిగిలిన రాష్టాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య తక్కువగా ఉండటం ఊరటనిచ్చే అంశం. ఇక ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా ప్రజలకు 195 కోట్లకు పైగా కోవిడ్ వ్యాక్సిన్ డోసులు అందించినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈ స్థాయిలో వ్యాక్సినేషన్ జరిగిన అతికొద్ది దేశాల సరసన భారత్ నిలిచింది. వ్యాక్సినేషన్ కారణంగా భారత్లో కోవిడ్ నాలుగో వేవ్ గురించి అంతగా ఆందోళన చెందనక్కర్లేదని, అయితే ఇతర ఆరోగ్య సమస్యలున్నవారికి ప్రమాదకరంగా పరిణమించవచ్చని మరికొందరు చెపుతున్నారు.