రైల్వే ఉద్యోగ పరీక్షలో గట్టేందుకు ఓ కుర్రాడు చావు తెలివి తేటలు ప్రదర్శించాడు. తనకు బదులుగా స్నేహితుడితో పరీక్ష రాయించేందుకు ప్రయత్నించాడు. బయోమెట్రిక్ గుర్తింపు కోసం తన బొటనవేలు చర్మాన్ని స్నేహితుడి వేలుకు అంటించాడు. అయితే పరీక్షా కేంద్రం వద్ద అనుమానించిన పర్యవేక్షకుడు చేతిపై శానిటైజర్ పోయగా అది ఊడిపోయింది. దీంతో నకిలీ అభ్యర్థితోపాటు అసలు అభ్యర్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్లోని వడోదరలో ఈ సంఘటన జరిగింది.
బీహార్లోని ముంగేర్ జిల్లాకు చెందిన 20 ఏళ్ల మనీష్ కుమార్, ఎలాగైనా రైల్వేలో ఉద్యోగం సాధించాలని అనుకున్నాడు. డీ గ్రూప్ పోస్టు కోసం దరఖాస్తు చేశాడు. అయితే చదువులో మెరుగైన తన క్లాస్మేట్, స్నేహితుడు రాజ్యగురు గుప్తాతో రైల్వే ప్రవేశ పరీక్ష రాయించాలని భావించాడు. దీనికి అతడి సహాయం కోరి ఒప్పించాడు.
కాగా, పరీక్ష కేంద్రం వద్ద బయోమెట్రిక్ గుర్తింపులో స్నేహితుడే తానుగా నమ్మించేందుకు మనీష్ కుమార్ ప్లాన్ వేశాడు. పరీక్షకు ముందు రోజు కాలుతున్న పెన్నంపై తన బొటనవేలు ఉంచాడు. వేడికి కమిలి ఊడిన పైచర్మాన్ని మెల్లగా తొలగించి రాజ్యగురు గుప్తా కుడి చేయి బొటనవేలికి అంటించాడు. రైల్వే పరీక్షకు తనకు బదులుగా స్నేహితుడ్ని గుజరాత్కు పంపాడు.
ఈ నెల 22న వడోదరలోని లక్ష్మీపుర ప్రాంతంలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రానికి మనీష్ కుమార్ తరుఫున అతడి స్నేహితుడు రాజ్యగురు గుప్తా హాజరయ్యాడు. అయితే బయోమెట్రిక్ గుర్తింపు కోసం బొటనవేలితో ప్రయత్నించగా పలుసార్లు విఫలమైంది.
మరోవైపు, రాజ్యగురు గుప్తా తన కుడి చేతిని ఫ్యాంటు జేబులో దాచి ఉంచడంతో పరీక్షా పర్యవేక్షకుడు అనుమానించాడు. తనిఖీ కోసం కుడి చేతి బొటనవేలిపై శానిటైజర్ పోశాడు. దీంతో అంటించిన చర్మం ఊడింది. ఈ నేపథ్యంలో రాజ్యగురు గుప్తాను పోలీసులకు అప్పగించారు. అతడు అసలు విషయం చెప్పడంతో రైల్వే పరీక్షలో మోసం చేసేందుకు ప్రయత్నించిన అసలు అభ్యర్థి మనీష్ కుమార్తోపాటు చీటింగ్కు సహకరించిన స్నేహితుడు రాజ్యగురు గుప్తాను పోలీసులు అరెస్ట్ చేశారు.