నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని ఈడీ విచారిస్తున్న విషయం తెలిసిందే. గడచిన మూడు రోజుల్లో దాదాపు 30 గంటల పాటు ఆయనను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రశ్నించారు. నేషనల్ హెరాల్డ్ అనేది భారత్ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ హయాంలో ఏర్పాటైన మీడియా సంస్థ. దీనికి సంబంధించిన ఆస్తులు, నిధుల వివాదమే ప్రస్తుత కేసుకు మూలం. అయితే రాజకీయాల్లో మిస్టర్ క్లీన్ ఇమేజ్తో క్రమంగా ప్రజల్లో ఆదరణను పెంచుకుంటూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తున్న రాహుల్గాంధీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసేందుకు బీజేపీ ప్రభుత్వం పన్నిన కుట్రతోనే ఇదంతా జరుగుతోందంటూ కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలకు దిగారు.
బీజేపీ ఉధృతిని అడ్డుకోలేక ఇప్పటిదాకా చాలా రాష్ట్రాల్లో స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ శ్రేణుల్లో ఒకరకంగా రాహుల్ పై ఈడీ విచారణ కదలిక తెచ్చిందని చెప్పాలి. ఇక ఉద్యమాల ద్వారా తమ ఉనికిని చాటుకోకపోతే పార్టీ మరింత కష్టాల్లోకి జారిపోతుందేమోనన్న భయం ఆ పార్టీ కార్యకర్తల్లో నెలకొన్నట్టు కనిపిస్తోంది. కాగా కాంగ్రెస్ పార్టీ క్షేత్ర స్థాయిలో బలంగా ఉన్న తెలంగాణలో సహజంగానే శ్రేణులు ఈ అంశంపై రోడ్ల మీదికి వచ్చాయి. మోదీ ప్రభుత్వం సోనియా గాంధీ కుటుంబంపై కక్ష సాధింపు చర్యలకు నిరసనగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి పిలుపుతో హైదరాబాద్లో గురువారం ఛలో రాజ్భవన్ కార్యక్రమం చేపట్టింది. కేంద్ర మాజీమంత్రి రేణుకా చౌదరి, మల్లు రవి, చిన్నారెడ్డి, జగ్గారెడ్డి సహా పలువురు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజ్భవన్ ముట్టడికి పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కొందరు బస్సులను ధ్వంసం చేశారు. దీంతో పోలీస్లు లాఠీ ఛార్జీ చేయడంతో పాటు పలువురు నాయకులను అరెస్టు చేశారు.
కాగా ఇప్పుడు ఈ కార్యక్రమం పార్టీ నేతల మధ్య విమర్శల యుద్ధానికి దారితీసింది. కేంద్ర ప్రభుత్వ రహస్య ఆదేశాలతోనే తాము శాంతియుతంగా చేస్తున్న ర్యాలీని పోలీసులు భగ్నం చేశారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు దీని ద్వారా నరేంద్ర మోడీని ప్రసన్నం చేసుకునేందుకు కేసీఆర్ ప్రయత్నించారని ఆయన ఘాటుగా విమర్శించారు. కేంద్రాన్ని సంతృప్తి పరిచేందుకే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ శ్రేణులపై దాడులు చేయించిందని రేవంత్ మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా నాటి కాంగ్రెస్ సర్కారు ఇలాగే వ్యవహరించి ఉంటే కేసీఆర్, కేటీఆర్ ఎక్కడ ఉండేవారని ఆయన ప్రశ్నించారు మోడీ, కేసీఆర్ ఇద్దరిదీ ఒకే బాట అని విమర్శించారు.
ఇటీవలి కాలంలో కేంద్రంపై యుద్ధం ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మోదీపై పోరాటానికి విపక్షాలను కలిపే ప్రయత్నంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే అవన్నీ బీజేపీకి మేలు చేకూర్చే వ్యూహంలో భాగమేనని ప్రజల్లోకి మెసేజ్ పంపేందుకు రేవంత్రెడ్డి ఈ సందర్భాన్ని వినియోగించుకున్నారు. తద్వారా ఏకకాలంలో రెండు పార్టీలను టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. ఇక సీనియర్ నేత రేణుకాచౌదరితో పాటు ఇతర నాయకులూ ఇదే తరహాలో విమర్శలు చేయడం గమనార్హం. కాంగ్రెస్ శ్రేణులపై దాడులను నిరసిస్తూ శుక్రవారం జిల్లా కేంద్రాల్లో, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. మొత్తంమీద రాహుల్పై ఈడీ విచారణ అంశాన్ని తెలంగాణలో పార్టీకి మైలేజ్ పెరిగేందుకు వినియోగించుకోవడంలో రేవంత్ సక్సెస్ అయ్యారనే చెప్పాలని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.