- భవిష్యత్తులో తీవ్ర నష్టాలు తప్పవంటున్న శాస్త్రవేత్తలు
- క్రమంగా మందగిస్తున్న భూ భ్రమణ వేగం
- అంతర్గత పొరలు, సూర్యుడిలో మార్పులే ఇందుకు కారణం
సూర్యుడి నుంచి భూమి దూరంగా జరుగుతుందని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. ఏటా చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఈ దూరం నమోదవుతున్నట్టు వెల్లడించారు. అలాగే, భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం (భ్రమణ వేగం) పెరిగిందని ఇటీవల కొన్ని వార్తలు వచ్చాయి. జూలై 26న నిర్ణీత 24 గంటలకు ముందే అంటే 1.59 మిల్లీ సెకండ్ల ముందే భూమి తన భ్రమణాన్ని పూర్తి చేసినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే, ఆ రికార్డు ఆ రోజుకే పరిమితమైందని, ప్రస్తుతం భూమి భ్రమణ వేగం క్రమంగా మందగిస్తున్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మార్పులకు కారణాలు
సూర్యుడి నుంచి భూమి దూరంగా జరిగిపోవడానికి కారణం సూర్యుడు తన ద్రవ్యరాశిని కోల్పోవడమేనని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. న్యూక్లియర్ ఫ్యూజన్ కారణంగా ద్రవ్యరాశిని శక్తిగా మార్చుతున్న సూర్యుడు ఆ కాంతిని విశ్వాంతరాళంలోకి వెదజల్లుతున్నాడు. ఈ క్రమంలో తన ద్రవ్యరాశిని క్రమంగా కోల్పోతున్నాడు. ద్రవ్యరాశిలో తగ్గుదల గురుత్వాకర్షణ శక్తిని బలహీనం చేస్తుంది. దీంతో గురుత్వాకర్షణ శక్తి వీక్గా మారడంతో భూమి సూర్యుడికి దూరంగా జరుగుతున్నది.
భూమి భ్రమణ వేగంలో మార్పులకు కారణాలను ఇప్పటివరకూ శాస్త్రవేత్తలు కచ్చితంగా కనుగొనలేకపోయారు. అయి తే, భూమి లోపలి, బయటి పొరల్లో మార్పులు, మహాసముద్రాల్లో ఆటుపోట్లు, వాతావరణంలో పెను మార్పులు జరుగుతుండటంతో ధ్రువాల వద్ద ఉన్న మంచు పెద్దమొత్తంలో కరుగడం, భౌగోళిక ధ్రువాల్లో కదలికలు, భూకంపాలు వగైరా భూభ్రమణ వేగంలో మార్పునకు కారణంగా అంచనా వేస్తున్నారు.
నష్టాలేమిటి?
ఇక సూర్యుడి నుంచి భూమి దూరంగా జరిగితే వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవచ్చు. కాలాల్లో పెను మార్పులు జరుగొచ్చు. భూమ్యాకర్షణ శక్తిలో హెచ్చతగ్గులు చోటుచేసుకోవడంతో సమాచార వ్యవస్థలో, మనుషులు, జంతువుల దైనందిన జీవితంలో మార్పులు చోటుచేసుకోవచ్చు. సూర్యుడి నుంచి భూమి దూరం మరింత పెరిగితే మళ్లీ మంచుయుగం నాటి పరిస్థితులు తలెత్తవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.