‘ఎవరైనా మరణిస్తే గంటల వ్యవధిలో కర్మ కాండలు నిర్వహించడం దాదాపు అన్ని చోట్ల ఆనవాయితీ. అయినవాళ్లు వచ్చేవరకు రోజుల వ్యవధిలో శవాన్ని ఉంచడం ఇటీవల ప్రపంచీకరణ నేపథ్యంలో సర్వసాధారణమ్.’ అయితే… థాయ్ల్యాండ్లో భార్య శవాన్ని 21 సంవత్సరాల పాటు ఇంటిలోనే అట్టిపెట్టుకున్నాడో వ్యక్తి. విశ్రాంత సైనికాధికారి చాన్ చనవచరకర్న్ భార్య అనారోగ్యంతో 2001 లో చనిపోయింది. శవపేటికలో భార్య మృతదేహాన్ని ఉంచి.. మృతదేహం పాడవకుండా కొన్ని రసాయనాలు పూసి.. ఇంటిలోనే భద్రంగా చూసుకుంటున్నాడు.
రోజూ శవపేటిక దగ్గర కూర్చుని భార్యతో ముచ్చటించేవాడు. ఇపుడు తనకు 72 ఏళ్ళు వచ్చాయి. ఇంకా శవపేటిక పరిరక్షణ తనవల్ల కాదనుకున్నాడో ఏమో అంత్యక్రియలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఓ ధార్మిక సంస్థ సాయంతో కర్మకాండ పూర్తి చేశాడు. అంతటితో ఊరుకోలేదు. చితాభస్మాన్ని ఓ కలశంలో ఉంచి ఇంటికి తీసుకుపోయాడు. తాను బతికి ఉన్నంత వరకు ఆ భస్మాన్ని తనతోనే ఉంచుకుని తన భార్యతో గడిపిన జ్ఞాపకాలు నెమరువేసుకుంటాని అంటున్నాడీ పెద్దాయన.