కరోనా ప్రభావంతో ఆలయాల్లో చాలా కార్యక్రమాలు ఆగిపోయిన విషయం తెలిసిందే. కలియుగ దైవంగా భావించే తిరుమల వేంకటేశుడి బ్రహ్మాత్సవాలపై కూడా ఆ ప్రభావం పడింది. దీంతో రెండేళ్ల పాటు తిరుమల శ్రీవారికి బ్రహ్మోత్సవాలు భక్తులు లేకుండానే నిర్వహించారు. అయితే ఇప్పుడు కరోనా మునుపటితో పోల్చితే కొంచెం సద్దుమణగడంతో ఈసారి భక్త జనసందోహం నడుమ స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. సెప్టెంబరు 27 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించానున్నారు. అక్టోబరు 5న ఈ ఉత్సవాలు ముగుస్తాయని టీటీడీ ఏవో ధర్మారెడ్డి తెలిపారు.
సెప్టెంబరు 27వ తేదీ సాయంత్రం మీన లగ్నంలో 5.45-6.15 గంటల మధ్య ధ్వజారోహణం జరగనుందని.. ఈ సందర్భంగా సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని ధర్మారెడ్డి వెల్లడించారు. అలాగే అక్టోబరు 1న గరుడ సేవ, అక్టోబరు 2న స్వర్ణ రథ సేవ, అక్టోబరు 4న రథోత్సవం జరుగుతాయని, అక్టోబరు 5న చక్రస్నానంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఏవో పేర్కొన్నారు. రెండేళ్ల నుంచి భక్తులు వచ్చే అవకాశం లేకపోవడంతో ఈసారి అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో పసిపిల్లు, తల్లిదండ్రులు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శనాలు ఉండవని ఏవో చెప్పారు. తిరుమలలో పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ పై నిషేధం ఉండడంతో భక్తులు రాగి, గాజు, స్టీల్ వాటర్ బాటిళ్లు తెచ్చుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.