చిన్నపుడు ఒకసారి నాన్నతో గంగానదిపై గూటిపడవలో ప్రయాణించటం ఓ మధురానుభూతి. అలా పడవలో నాన్న, నేను ఎంతో దూరం ప్రయాణించేవాళ్ళం. మాతో పుస్తకాలు కూడా వెంట తీసుకువెళ్ళేవాళ్ళం. ఆ ప్రయాణంలోనే నాకు నాన్న జయదేవుని ‘గీతగోవిందమ్‘ పరిచయం చేసారు. అప్పుడు నాకు సంస్కృతం తెలియదు. నాన్న మా మాతృభాష బెంగాలీలో వాటిని వర్ణిస్తూ ఉంటే మైమరిచిపోయేవాణ్ణి. ఆ అనుభూతితో తదనంతర కాలంలో ‘గీతగోవిందమ్’ ఎన్ని మార్లు చదివానో చెప్పలేను. ఆ పరంపరలో అయన సాహచర్యంతో ‘కుమారసంభవం’ తదితర సంస్కృత కావ్యాలను కూడా పరిచయం చేసుకున్నాను. నన్ను ఇంగ్లీష్ లో నిష్టాతుడిని చేయటం కోసం విదేశాల నుంచి ఎన్నో గ్రంథాలు తెప్పించారు. అలాగే ఒకసారి నాన్నతో హిమాలయాల దర్శనం కూడా మరపురాని అనుభూతి. ఇలా సాహిత్యం, సంగీతం పర్యాటకం అన్నింటి కన్నా ముఖ్య0గా ఆధ్యాత్మిక జీవనం అన్నీ నాన్న సాన్నిహిత్య పరిమళాలే. ముఖ్య0గా నా చిన్న వయసులో అమ్మ అకాలంగా దూరమైంది. అప్పటి నుంచి నాన్నతో చనువు మరింత ఇనుమడించింది. అప్పటి వరకు నాతో ఎంతో గంభీరంగా ఉండే నాన్న అమ్మ కన్ను మూశాక, ఆమె లోటును భర్తీ చేసారు. అలా ఆయనలోనే ఆమెను చూసుకునేలా చేసారు.